Telangana formation day: ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లను నెర‌వేర్చ‌డ‌మే ల‌క్ష్యం.. తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల్లో సీఎం రేవంత్ రెడ్డి

Published : Jun 02, 2025, 12:22 PM IST
Telangana CM Revanth reddy

సారాంశం

తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌లో జ‌రిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల్లో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ప్రజల ఆకాంక్షలే మా లక్ష్యం

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రసంగిస్తూ, గతంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక వ్యవస్థను మళ్లీ నిలదొక్కుకునేలా కృషి చేస్తున్నామన్నారు.

మహిళల ఆర్థిక స్వయం సమృద్ధికి కొత్త చర్యలు

రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని సీఎం చెప్పారు. కోటిమంది మహిళలకు సున్నా వడ్డీతో రూ.21 వేల కోట్ల రుణాలు మంజూరు చేశామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళలకే అప్పగించామన్నారు. మహిళా సంఘాలకు బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చి వారికొక ఆదాయ మార్గం కల్పించామన్నారు. ఇకపై QR కోడ్ కార్డులు ఇచ్చి ఉచిత ఆరోగ్య పరీక్షలు చేసే కొత్త పథకం ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

రైతుల సంక్షేమం ప్ర‌ధాన ఉద్దేశం

రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని రేవంత్‌ తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రూ.2 లక్షల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేశామని, దానితో రైతుల ఖాతాల్లో రూ.26 వేల కోట్ల డబ్బు జమ చేసినట్లు తెలిపారు. సన్నవడ్లు పండించే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.75 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతోంది. భూములపై వివాదాలను నివారించేందుకు 'భూభారతి' అనే కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు.

విద్యా, వైద్య రంగాల్లో సమగ్ర అభివృద్ధి

విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం చూపేలా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీని స్థాపించామని సీఎం చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. గురుకులాల వార్డుల్లో వసతి గృహాల డైట్, కాస్మొటిక్స్ ఛార్జీలు పెంచినట్లు పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రిని పునర్నిర్మించి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న‌ట్లు చెప్పుకొచ్చారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిని రూ.10 లక్షల వరకు పెంచినట్టు చెప్పారు.

 

 

కులగణనతో దేశవ్యాప్తంగా మార్పు

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన నిర్ణయం దేశంలో చర్చకు దారితీసిందని సీఎం తెలిపారు. వందేళ్లలో జ‌రిగిన అతి పెద్ద చర్యగా దీన్ని అభివర్ణించారు. ఈ చర్యతో కేంద్ర ప్రభుత్వంలో కూడా చలనం వచ్చిందని, రాబోయే జనగణనలో కులగణనను చేర్చుతామని కేంద్రం ప్రకటించిందని సీఎం ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Weather Update : కనుమ రోజు కనువిందు చేసే వెదర్.. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం
హైదరాబాద్‌లో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్ | Sankranthi Food Festival Reaction | Asianet News Telugu