
టిఆర్ఎస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు సిఎం కేసిఆర్ సీరియస్ డైరెక్షన్ ఇచ్చారు. అధికారుల వెంట పడాలని పనులు చేయించుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్ని రకాల చెరువులను గోదావరి నీటితో నింపుకునే విధంగా కాల్వలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి కాళేశ్వరం నీరు అందుబాటులోకి వస్తున్నందున ఈ లోపుగానే ఆ పనులు చేసుకోవాలని, ఎక్కడికక్కడ ప్రజా ప్రతినిధులే ఈ పనుల విషయంలో చొరవ తీసుకోవాలని సిఎం చెప్పారు. ప్రస్తుతం ఎస్.ఆర్.ఎస్.పి, నిజాంసాగర్, ఎల్ఎండి, సింగూరులో మిషన్ భగీరథ అవసరాలకు పోను మిగతా నీటిని పంట పొలాలకు మళ్లించడానికి సిఎం అంగీకరించారు. నిజాం సాగర్, సింగూరు, ఘనపూర్ ఆనికట్, గుత్ప, అలీ సాగర్, లక్ష్మికెనాల్, ఎస్.ఆర్.ఎస్.పి. ఆయకట్టుకు నీరు అందిచాలని సిఎం నిర్ణయించారు. ఈ నీటితో రెండో పంట పండించుకోవాలని, ఎక్కడా వివాదాలకు తావు లేకుండా ప్రజా ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి నీటిని పొలాలకు మల్లించాలని సిఎం చెప్పారు. నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
ఎస్ఆర్ఎస్పి నీటి విడుదల, వినియోగానికి సంబంధించి పాత కరీంనగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో మంగళవారం సమావేశం నిర్వహించారు. మంత్రులు కెటి రామారావు, ఈటెల రాజెందర్, చీప్ విప్ లు కొప్పుల ఈశ్వర్, పాతూరి సుధాకర్ రెడ్డి, ఎంపిలు కెప్టెన్ లక్ష్మి కాంతరావు, బి.వినోద్ కుమార్, కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్, ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నీటి పారుదల, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.
నీటి పారుదల రంగానికి కావాల్సిననన్ని నిధులు సమకూర్చడంతో పాటు, తెలంగాణకున్న నీటి వాటా మొత్తం వాడుకునే విధంగా భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున ఎంత వీలైతే అంత వరకు పంటలకు సాగునీరు అందించే వ్యవస్థను సిద్ధం చేయాలని సిఎం కేసీఆర్ చెప్పారు. ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లోని పొలాల దాకా నీరందించి పంటలు పండించే వరకు విశ్రమించకుండా అధికారుల వెంట పడి పనులు చేయించుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్న పాత కరీంనగర్ జిల్లాలో ప్రతీ ఎకరాకు నీరందే విధంగా ఏర్పాటు జరగాలని సిఎం స్పష్టం చేశారు. రామగుండం ప్రాంతంలో 20 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఎల్లంపల్లి నుంచి ప్రత్యేక ఎత్తిపోతల పథకం నిర్మించాలని సిఎం ఆదేశించారు. ధర్మారం మండలం పత్తిపాకలో రిజర్వాయర్ నిర్మించి పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, ధర్మపురి నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని సిఎం చెప్పారు. ఈ రెండింటికి అవసరమైన నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఎస్.ఆర్.ఎస్.పి. సామర్థ్యం పెంచాలని, అన్ని రకాల కాల్వలు మరమ్మతులు చేయాలని చెప్పారు. ఎస్.ఆర్.ఎస్.పి.లో తొలి, చివరి ఆయకట్టు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే ప్రణాళిక అమలు చేయాలని సూచించారు.
‘‘ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద మనం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బ్యారేజి నిర్మిస్తున్నం. అక్కడ 1700ల టిఎంసిల సగటు నీటి లభ్యత ఉందని చెప్పారు. ఈ నీటిని వాగుకోవడానికి అవసరమైన బ్యారేజిలు, రిజర్వాయర్లు నిర్మిస్తున్నామన్నారు. ఈ నీటిని పంట పొలాలకు అందించే వరకు ప్రజా ప్రతినిధులు శ్రద్ద తీసుకుని తమ ప్రాంతంలో పనులు చేయించుకోవాలన్నారు. గోదావరి, కృష్ణ నదుల్లో తెలంగాణకు 265 టిఎంసిల నీటి వాటా ఉందని 1974లో బచావత్ ట్రిబ్యునల్ తేల్చిందని, కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో చెరువులు ధ్వంసం కావడం వల్ల అంత మొత్తంలో నీటిని వాడుకోలేకపోయామన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల నీటి లభ్యత ఉంటుందని, అన్ని చెరువులు నింపుకునే విధంగా కార్యాచరణ అమలు చేయాలని సిఎం సూచించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి