
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. దాదాపు వారం రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్.. తెలంగాణలోని పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ద్వారా నివేదించారు. అలాగే రాష్ట్రంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై పార్లమెంట్ వేదికగా పోరాటం చేయాలని టీఆర్ఎస్ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఇక, హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్.. ఆగస్టు మొదటి వారం నుంచి జిల్లాల్లో పర్యటించాలని యోచిస్తున్నట్టుగా అధికార వర్గాలు తెలిపాయి.
ఆగస్ట్ 4న బంజారాహిల్స్లో ఇంటిగ్రేటెడ్ పోలీస్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ను కేసీఆర్ ప్రారంభించనున్నారు. తర్వాత రోజుల్లో కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ధరణి పోర్టల్లోని భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల్లో దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో.. అన్ని జిల్లాల్లో 'రెవెన్యూ క్యాంపు'లను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు.
ఇక, ఢిల్లీ పర్యటన విషయానికి వస్తే.. కేసీఆర్ రాజకీయాలపై కంటే.. పెండింగ్లో ఉన్న రుణ సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే పరిమితమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఆర్థిక కార్యదర్శి కె రామకృష్ణారావును రోజువారీ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులను కలవడానికి నియమించారు. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం నిలిచిపోయిన కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు మిగిలిన 20 శాతం రుణాల పంపిణీకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ఆమోదం తెలపడంలో అధికారులు సఫలమయ్యారు. జూన్ మొదటి వారం నుంచి మిల్లుల నుంచి బియ్యం సేకరణను కేంద్రం నిలిపివేసిన నేపథ్యంలో.. రబీకి సంబంధించి వరి సేకరణ గడువును 45 రోజులు పొడిగించాలని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖను ఒప్పించడంలో కూడా అధికారులు సఫలీకృతమయ్యారని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ రాజకీయ భేటీల విషయానికి వస్తే ఆయన జూలై 29న సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్గోపాల్ యాదవ్తో భేటీ అయ్యారు.