
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహారాష్ట్ర పర్యటకు బయలుదేరారు. రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్న కేసీఆర్.. ఈ రోజు ఉదయం హైదరాబాద్లో ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్తో బయలుదేరి వెళ్లారు. కేసీఆర్ కాన్వాయ్లో రెండు ప్రత్యేక బస్సులు, దాదాపు 600 వరకు కార్లు ఉన్నాయి. ఈ వాహనాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఇక, మహారాష్ట్రకు బయలుదేరే ముందు ప్రగతి భవన్లో పలువురు మంత్రులు, నేతలకు కేసీఆర్ అల్పహార విందు ఇచ్చారు.
ఇక, ఇప్పటికే మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. ఆ రాష్ట్రంలో పలు బహిరంగ సభలు నిర్వహించారు. తాజాగా కేసీఆర్ మరోమారు మహారాష్ట్ర పర్యటనకు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన భారీ కాన్వాయ్తో బయలుదేరిన కేసీఆర్ ఈ రోజు సాయంత్రానికి షోలాపూర్ చేరుకుంటారు. ఈరోజు రాత్రి కేసీఆర్, ఇతర నాయకులు షోలాపూర్లోనే బస చేయనున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని పలువురు బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ నుంచి వెళ్లి అక్కడ స్థిరపడిన ప్రజలు.. కేసీఆర్ను కలవనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మంగళవారం (జూన్ 27న) ఉదయం షోలాపూర్ నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న పండరిపూర్కు కేసీఆర్ చేరుకోనున్నారు. అక్కడి విఠోభారుక్మిణి మందిర్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న తెలంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించాలని కోరుతూ కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దాదాపు 400 మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఈ పూజల్లో పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది.
ఈ పర్యటనలో కేసీఆర్ సమక్షంలో షోలాపూర్ జిల్లాకు చెందిన భగీరథ్ బాల్కే సహా పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరనున్నారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరనున్న కేసీఆర్.. దారాశివ్ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం రోడ్డుమార్గాన హైదరాబాద్కు చేరుకుంటారు. ఇక, మరోవైపు షోలాపూర్, పండర్పూర్లో బీఆర్ఎస్ మద్దతుదారులు కేసీఆర్కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.