
హైదరాబాద్: తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమిలో, లేదా అధికార పక్షం ఎన్డీయే కూటమిలో లేమని స్పష్టం చేశారు. ఈ రెండు కూటముల్లో చేరాల్సిన అవసరం తమకు లేదని వివరించారు. ఇది వరకు దేశంలో అధికారంలో ఉన్నవారే ఆ కూటముల్లో ఉన్నారని, కానీ, దేశంలో మార్పు ఏమీ లేదని ఆరోపించారు. దేశం ఒక కొత్త మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని, అది ఈ రెండు కూటములతో రాదని పేర్కొన్నారు. అందుకే తాము ఈ రెండు కూటములకు దూరంగా ఉంటున్నామని చెప్పారు. అందులో చేరాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. అలాగని, తాము ఒంటరిగా ఏమీ లేమని వివరించారు. తమతో నడిచే మిత్రులూ ఉన్నారని బీఆర్ఎస్ చీఫ్ కే చంద్రశేఖర్ రావు అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో ఒక్క రోజు పర్యటన చేశారు. మంగళవారం ఆయన మహారాష్ట్రలోని వాటేగామ్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్రలో సందపకు, వనరులక కొదవ లేదని అన్నారు. అద్భుతమైన వనరులు, ఉపాధి అవకాశాలు అపారంగా ఉన్నాయని చెప్పారు. కానీ, వాటిని సక్రమంగా వినియోగంలో పెట్టడం జరగట్లేదని ఆరోపించారు. ఏ పట్టణానికి వెళ్లినా తాగు నీటి కొరత ఉన్నదని అన్నారు.
మహారాష్ట్రలో మాతంగి కమ్యూనిటీకి చెందిన ప్రముఖ దళిత కవి, ఆలోచనపరుడు అన్నాభావూ సాఠే 103వ జయంతి సందర్భంగా వాటేగావ్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అన్నాభావూ సాఠే.. మాతంగి సమాజ ముద్దుబిడ్డ అని, కమ్యూనిస్టుగా, అంబేద్కరిస్టుగా సమసమాజ స్థాపన కోసం ఆయన తన జీవితాంతం పని చేశారని వివరించారు. రష్యా ప్రధాని పిలిపించుకుని ఆయనను సన్మానించిందని, ఇప్పటికీ రష్యా లైబ్రరీలో సాఠే విగ్రహముందని చెప్పారు. కానీ, ఇక్కడి ప్రభుత్వాలు ఆయనను గుర్తించకపోవడం, ఆయన సాహిత్యాన్ని మరుగనపరచడం శోచనీయం అని పేర్కొన్నారు. సాఠేకు భారత రత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: పవన్ కళ్యాణ్ పై సినిమా తీస్తా.. ఈ పేర్లు పరిశీలిస్తున్నా: మంత్రి అంబటి
కానీ, దళిత సమాజం ఇంకా వెనుకబడే ఉన్నదని, తాము మాతంగి కమ్యూనిటీకి భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు. అమెరికాలో ఒక నల్లజాతీయుడైన బరాక్ ఒబామా అధ్యక్షుడైన తర్వాత అక్కడ నల్లజాతీయుల జీవితాల్లో మార్పు వచ్చినట్టే ఇక్కడ కూడా అలా జరగాలని వివరించారు.
తమ పార్టీ మహారాష్ట్రలో వేగంగా విస్తరిస్తున్నదని కేసీఆర్ అన్నారు. దాదాపు 50 శాతం గ్రామాల్లో కమిటీ ఏర్పాట్లు పూర్తయ్యాయని, మరో 15 నుంచి 20 రోజుల్లో ఇతర గ్రామాల్లోనూ ఈ పని పూర్తి చేస్తామని, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేస్తామని వివరించారు.