
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ)కు (nsui) సంబంధించిన తెలంగాణ విభాగం ఎగ్జిక్యూటివ్ సమావేశం బుధవారం రసాభాసగా ముగిసింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న బల్మూరి వెంకట్ (venkat balmoor) , ఉపాధ్యక్షురాలిగా ఉన్న చందనా రెడ్డిల (chandana reddy) మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం కాస్తా ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాలు కుర్చీలు, బల్లలు ఎత్తేసుకుని మరీ పరస్పరం దాడులు చేసుకున్నారు.
కాగా.. రెండేళ్లుగా ఎన్ఎస్యూఐ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరగలేదు. ఈ క్రమంలో బుధవారం గాంధీ భవన్ ఆవరణలోని ఇందిరా భవన్ లో మొదలైన ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఇదే విషయాన్ని చందనారెడ్డి లేవనెత్తారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం మొదలైంది. ఆపై మరింత రెచ్చిపోయిన ఇరు వర్గాలు కుర్చీలు, బల్లలు విసురుకుంటూ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దీంతో సమావేశం రసాభాసగా ముగిసింది.
కాగా.. హైదరాబాద్ (hyderabad city woman congress president) సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కవితపై (kavitha) అధిష్టానం వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇటీవల గాంధీ భవన్లో సునీతా రావు (sunitha rao) కవిత మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనిని సీరియస్గా తీసుకున్న హైకమాండ్... కవితను సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించింది.
గత శనివారం గాంధీభవన్లో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. మహిళా నేతలు సునీతరావు, కవిత మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఇరువురు బూతులు తిట్టుకున్నారు. అనంతరం సమావేశంలో నుంచి కవిత బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటన ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.