
హైదరాబాద్: Online Loan App ల విషయంలో హైద్రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం Hyderabad జియాగూడకు చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొన్నాడు.
అయితే హైద్రాబాద్ కు చెందిన Shankar అనే వ్యక్తికి కూడా ఆన్ లైన్ లోన్ యాప్ నుండి వేధింపులు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్ లైన్ లోని లోన్ యాప్ నుండి శంకర్ అనే వ్యక్తి రూ. 3 వేలు అప్పుగా తీసుకున్నాడు. అయితే వడ్డీతో కలుపుకొని రూ.4900 చెల్లించాడు. అయితే శంకర్ కు సంబంధం లేకుండానే ఆయన బ్యాంక్ ఖాతాలో లోన్ యాప్ నిర్వాహాకులు రూ. 14 వేలు జమ చేశారు.
ఈ విషయాన్ని గుర్తించిన శంకర్ లోన్ యాప్ సంస్థకు మెయిల్ చేశాడు. తాను కోరకుండానే డబ్బులు గురించి ప్రశ్నించాడు. అయితే రూ. 14 వేల లోన్ కు వడ్డీతో కలిపి రూ. 30 వేలు చెల్లించాలని శంకర్ ను లోన్ యాప్ నిర్వాహకులు బెదిరించారు.శంకర్ స్నేహితులు, బంధువులకు కూడా పోన్ చేసి ఇదే విషయమై చెబుతున్నారు. దీంతో శంకర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ పిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గత నెల రోజుల వ్యవధిలో ఆన్ లైన్ లోన్ యాప్ లపై 50 కేసులు నమోదయ్యాయని సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ చెప్పారు.2020-21 లో ఆన్ లైన్ లోన్ యాప్ పై 28 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కొంత కాలంగా స్ధబ్దుగా ఉన్న ఆన్ లైన్ లోన్ యాప్ సంస్థలు తిరిగి తమ కార్యక్రమాలను ప్రారంభించినట్టుగా పోలీసులు గుర్తించారు. బెంగుళూరు, ఢిల్లీలలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారని పోలీసులు గుర్తించారు.ఈ సెంటర్లపై దాడులు చేస్తామని పోలీసులు తెలిపారు.ఆన్ లైన్ లోన్ యాప్ లను చైనా కు చెందిన కంపెనీలు నిర్వహిస్తున్నాయని పోలీసులు గుర్తించారు.ఈ విషయమై తెలంగాణ పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు.
ఆన్ లైన్ లోన్ యాప్ ల విషయమై గతంలో నమోదైన కేసుల విషయంలో తెలంగాణ పోలీసులు దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహించారు. ఢిల్లీ, బెంగుళూరులతో పాటు నిర్వహిస్తున్న కాల్ సెంటర్లలో పనిచేస్తున్నవారిని అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ లోన్ యాప్ నిర్వాహకులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను కూడా ప్రీజ్ చేశారు. అయితే నకిలీ లేఖల ఆధారంగా కొన్ని బ్యాంకు ఖాతాలను లోన్ యాప్ నిర్వాహకులు తెరిపించడంతో పోలీసులు వారిపై చర్యలు తీసుకున్నారు.