కామారెడ్డి కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు.. రేవంత్ రెడ్డి క్యాంప్ వద్దే ఘర్షణ..

By Sumanth KanukulaFirst Published Mar 19, 2023, 5:32 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలు పలు సందర్భాల్లో బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా కామారెడ్డి కాంగ్రెస్‌లో నేత మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. 

తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలు పలు సందర్భాల్లో బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా కామారెడ్డి కాంగ్రెస్‌లో నేత మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. ఇరువర్గాల నేతలు ఘర్షణకు దిగారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఈ ఘటన జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాదయాత్ర కామారెడ్డి జిల్లాలో కొనసాగుతుంది. అయితే ఎల్లారెడ్డి  నియోజకవర్గంలోని రేవంత్ రెడ్డి  పాదయాత్ర క్యాంపు వద్ద మదన్‌మోహన్, సుభాష్‌రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా ఘర్షణకు దారితీసింది. 

మదన్‌మోహన్ వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజును లోనికి వెళ్లకుండా సుభాష్ రెడ్డి అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. కొద్దిసేపట్లోనే అక్కడి తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు  చేసుకున్నారు. ఈ క్రమంలోనే  రేవంత్‌రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీ ఇరువర్గాలను అదుపు చేసే ప్రయత్నం చేసిన లాభం లేకుండా పోయింది. అయితే రేవంత్ పాదయాత్ర క్యాంప్ వద్దే నాయకుల మధ్య విభేదాలు ఈ స్థాయిలో బహిర్గతం కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

ఇక, గత కొంతకాలంగా మదన్‌మోహన్, సుభాష్‌రెడ్డి వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎల్లారెడ్డి  నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను సుభాష్ రెడ్డి వర్గం చూసుకుంటుంది. అయితే సుభాష్ రెడ్డి  వర్గంపై మదన్‌మోహన్ వర్గం గుర్రుగా ఉంది. సుభాష్‌రెడ్డి వర్గానికి రేవంత్‌రెడ్డి కొమ్ముకాస్తున్నారని మదన్‌మోహన్ వర్గం ఆరోపిస్తుంది. 
 

click me!