ఆడుకుంటుంటే కాటేసిన పాము.. తల్లిదండ్రులు తిడతారని దాచిపెట్టింది.. చివరికి..

By AN TeluguFirst Published Jul 26, 2021, 12:53 PM IST
Highlights

సాయంత్రం ఆ చిన్నారి స్నేహితులతో కలిసి ఆడుకుంది. ఆ సమయంలో ఓ విషపాము వేలిపై కాటు వేసింది. దీంతో ఒక్కసారి భయపడి ఇంట్లోకి పరుగున వెళ్లింది.  తల్లిదండ్రులు తిడతారని భయంతో ఆ విషయాన్ని దాచి పెట్టింది. కాలికి మీకు గుచ్చుకుంటే అని అబద్దం చెప్పింది. 

కొత్త గూడెం : వివాహం జరిగి 15 ఏళ్లు అయినా సంతానం కలగకపోవడంతో బంధువుల పాపను దత్తత తీసుకున్నారు ఓ దంపతులు. ఏడేళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఎనిమిదో పుట్టిన రోజు అమ్మమ్మ ఇంట్లో జరుపుకోవాలని వెళ్లిన ఆ చిన్నారి అందరికీ దూరమై పోతుందని ఎవరూ ఊహించలేదు. తల్లిదండ్రులు తిడతారనే భయంతో పాము కాటేసిన విషయాన్ని దాచడమే ఆమె పాలిట శాపమైంది.

ఉల్వనూరు పంచాయతీ లక్ష్మీదేవిపల్లికి చెందిన బోడ భాస్కర్, భారతి దంపతులకు సంతానం కలగకపోవడంతో  ఏడేళ్ల క్రితం బంధువుల పాప అఖిలను దత్తత తీసుకున్నారు. పాపకు ఆరునెలల ఉన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్నారు. పాపే ప్రాణంగా ఆ దంపతులు బతికారు. ఆదివారం ఎనిమిదో పుట్టినరోజు వేడుకలను అమ్మమ్మ ఇంటి వద్ద జరుపుకోవాలని శనివారం కొత్తగూడెంలోని కారుకొండ రామవరం వెళ్లారు.

సాయంత్రం ఆ చిన్నారి స్నేహితులతో కలిసి ఆడుకుంది. ఆ సమయంలో ఓ విషపాము వేలిపై కాటు వేసింది. దీంతో ఒక్కసారి భయపడి ఇంట్లోకి పరుగున వెళ్లింది.  తల్లిదండ్రులు తిడతారని భయంతో ఆ విషయాన్ని దాచి పెట్టింది. కాలికి మీకు గుచ్చుకుంటే అని అబద్దం చెప్పింది. ఎలాంటి గాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కొద్దిసేపటికి అఖిల నోట్లో నుంచి నురగ రావడంతో పాముకాట్లను వేలిపై గుర్తించారు. స్థానిక ఆర్ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తీసుకెళ్లారు. ఐదారు ఆసుపత్రులకు వెళ్ళినా చేర్చుకోకపోవడంతో అంబులెన్స్లో ఖమ్మం తరలించి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.  అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి  రాత్రి మృతి చెందింది.

ఆదివారం బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు చేశారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన చిన్నారి పుట్టినరోజు వేడుకకు ముందే మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారి రోదన స్థానికులను కంటతడి పెట్టించింది. 

click me!