లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి భౌతికకాయానికి ఆర్మీ స్టాఫ్ చీఫ్ నివాళులు.. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు..

By Sumanth KanukulaFirst Published Mar 18, 2023, 5:04 PM IST
Highlights

అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్ కూలిన మృతి చెందిన లెఫ్టినెంట్‌ ఉప్పల వినయ భానురెడ్డి(వీవీబీ రెడ్డి) అంత్యక్రియలను సైనిక లాంఛనాలతో నిర్వహించారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్ కూలిన మృతి చెందిన లెఫ్టినెంట్‌ ఉప్పల వినయ భానురెడ్డి(వీవీబీ రెడ్డి) అంత్యక్రియలను సైనిక లాంఛనాలతో నిర్వహించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో భారత వైమానిక దళం హెలికాప్టర్ చీతా కూలిపోయిన ఘటనలో లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ భానురెడ్డి, మేజర్‌ జయంత్‌ ప్రాణాలు కొల్పోయిన సంగతి తెలిసిందే. ఇందులో లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ భానురెడ్డి స్వస్థలం తెలంగాణ కాగా..  శుక్రవారం రాత్రి ఆయన భౌతికకాయాన్ని బేగంపేట ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ ఆర్మీ అధికారులు.. వీవీబీ రెడ్డి భౌతికకాయానికి పూర్తి సైనిక గౌరవంతో నివాళులర్పించారు. 

అనంతరం వీవీబీ రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్‌ మల్కాజిగిరిలోని ఆయన నివాసానికి తరలించారు. మల్కాజ్‌గిరిలోని వీవీబీ రెడ్డి నివాసానికి చేరుకున్న ఆర్మీ  చీఫ్ జనరల్ మనోజ్ పాండే.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

అనంతరం వీవీబీ రెడ్డి స్వగ్రామమైన యాదాద్రి-భువనగిరి జిల్లా బొమ్మలరామారానికి ఆయన భౌతికకాయాన్ని తరలించారు. అక్కడ వీవీబీ రెడ్డి భౌతికకాయానికి తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి,  సైనిక అధికారులు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు శ్రద్ధాంజలి ఘటించారు. సైనిక వాహనంపై భౌతికకాయం ఉంచి అంతిమయాత్రను నిర్వహించారు. వీవీబీ రెడ్డి అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనంతరం సైనిక లాంఛనాలతో వీవీబీ రెడ్డి అంత్యక్రియలు జరిగాయి.

ఇక, వీవీబీ రెడ్డి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) నుండి ఉత్తీర్ణత సాధించారు. దాదాపు 20 సంవత్సరాలు సైన్యంలో పనిచేశారని కుటుంబ వర్గాలు తెలిపాయి. వీవీబీ రెడ్డి భార్య స్పందన, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీవీబీ రెడ్డి భార్య స్పందన ఆర్మీలో డెంటిస్ట్‌గా పనిచేస్తున్నారు.

click me!