
Union Tourism Minister G Kishan Reddy: తెలంగాణలో వైద్య మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం రూ.1,028 కోట్లతో బీబీనగర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఏర్పాటుతో పాటు పలు కార్యక్రమాలను చేపట్టిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ.కిషన్రెడ్డి తెలిపారు. సనత్ నగర్ లోని ఈఎస్ఐసీ ఆసుపత్రిలో కొత్త ఓపీడీ బ్లాక్, అధునాతన వైద్య సదుపాయాల నిర్మాణానికి రూ.1,032 కోట్లు, ఆదిలాబాద్, వరంగల్ ప్రభుత్వాసుపత్రుల్లో అధునాతన వైద్య సదుపాయాల కోసం రూ.240 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 4,549 హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లు, పట్టణ ప్రాంతాల్లో బస్తీ దవాఖానాల ఏర్పాటుకు రూ.902 కోట్లతో నిధులు మంజూరయ్యాయన్నారు. దక్షిణ ప్రాంతంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూ.౩౦ కోట్లు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. .
కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలో ఆక్సిజన్ కొరత నేపథ్యంలో ప్రభుత్వం పీఎం కేర్స్ (PMCARES) నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 50 ప్లాంట్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 31.2 లక్షల మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద రూ.3,744 కోట్లు అందించిందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాలల ఏర్పాటుపై ఇద్దరు కేంద్ర ఆరోగ్య మాజీ మంత్రులు రాష్ట్రానికి లేఖ రాస్తే తెలంగాణ నుంచి స్పందన లేదని మంత్రి ఆరోపించారు. గత ఎనిమిదేళ్లలో దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, పీజీ సీట్లు భారీగా పెరిగాయని ఇటీవల రాజ్యసభలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం అందించింది. 2014లో దేశంలో 51,348 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండగా, 2022-23 నాటికి ఇది సుమారు 90 శాతం పెరిగి 96,077 కు చేరుకుంది. అదేవిధంగా మెడికల్ పీజీ సీట్లను 2014లో 31,185గా ఉన్న మెడికల్ పీజీ సీట్లను 2022-23 నాటికి 64,059కు పెంచింది. అదేవిధంగా, దేశంలో వైద్య కళాశాలల సంఖ్య 2014 లో 387 నుండి 2022 నాటికి 648 కు పెరిగింది. 2024-25 నాటికి అదనంగా తొమ్మిది ఎయిమ్స్ అందుబాటులోకి వస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు.
"గత ఎనిమిదిన్నరేళ్లలో దేశంలో వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా కేంద్రం అనేక చర్యలు తీసుకుంది. ఇది ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రంగాలలో పరివర్తనాత్మక మార్పును తీసుకువచ్చింది. అలాగే, ప్రజలకు సరసమైన ధరలకు అత్యాధునిక నాణ్యమైన వైద్య సౌకర్యాలను అందించాలని కృతనిశ్చయంతో ఉంది. ఇలాంటి అనేక వైద్య మౌళిక సదుపాయాల మెరుగుపర్చడంతో తెలంగాణలో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంటుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ. కిషన్రెడ్డి తెలిపారు. గృహ మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా చురుకైన చర్యలు తీసుకోవడంతో పాటు, సరసమైన మందులు, వ్యాక్సిన్ల అందుబాటు, ఆయుష్, యోగా వంటి దేశీయ జ్ఞాన వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామనీ, దేశవ్యాప్తంగా 1.5 లక్షల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు జీ.కిషన్ రెడ్డి తెలిపారు.