మునుగోడు బైపోల్ 2022: నేటి నుండి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్న బీఆర్ఎస్

By narsimha lodeFirst Published Oct 6, 2022, 12:05 PM IST
Highlights

మునుగోడుఅసెంబ్లీ నియోజకవర్గంలో  బీఆర్ఎస్ నేతలు ఇవాళ్టి నుండి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.  ఇప్పటికే ఆయా గ్రామాలకు టీఆర్ఎస్ నేతలకు ఇంచార్జీ బాధ్యతలను అప్పగించింది పార్టీ నాయకత్వం. 

మునుగోడు:మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహం కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించారు. 

ఈ ఏడాది నవంబర్ 3వ తేదీన మునుగోడుఅసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.   ఈ నెల 7వ తేదీనఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే  రోజు నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు. మునుగోడు అసెంబ్లీస్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధిని బీఆర్ఎస్ ఇంకా ప్రకటించలేదు.  ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి  స్రవంతి,  బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధిగా  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉంది.  అయితే పార్టీ మాత్రం అధికారికంగా అభ్యర్ధిని ప్రకటించలేదు. 

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా బీఆర్ఎస్ విభజించింది. ఒక్కో యూనిట్ కు ఎమ్మెల్యే, ఎంపీలకు బాధ్యతలు అప్పగించారు.  తమకు కేటాయించిన యూనిట్లలో నేతలు ప్రచారం నిర్వహించనున్నారు. కేటీఆర్, హరీష్ రావు లు తమకు కేటాయించిన గ్రామాల్లోనే  ఉంటూ ప్రచారం నిర్వహించనున్నారు.

మునుగోడుఅసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితిపై రెండు రోజుల క్రితం నేతలతో కేసీఆర్ చర్చించారు. మంత్రులు హరీష్ రావు,జగదీష్ రెడ్డి, కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,పార్టీ ఇంచార్జీ తక్కెళ్లపల్లిరవీందర్ రావు వంటి నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై  పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించారు. రెండు రోజుల్లో మునుగోడులో బరిలోకి దింపనున్న అభ్యర్ధిని బీఆర్ఎస్ ప్రకటించనుంది. కూసుకుంట్ల ప్రభాకర్  రెడ్డి అభ్యర్ధిత్వం  వైపే కేసీఆర్ మొగ్గుచూపుతున్నట్టుగా సమాచారం. అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై నియోజకవర్గంలోని పార్టీ నేతలు కొందరు అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తి వాదులను  పార్టీ నేతలు బుజ్జగిస్తున్నారు.

ఈ స్థానం నుండి మాజీమంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ దఫా కమలం అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ నెల 3వతేదీన మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 7నఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 

click me!