ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు: నేడు సుప్రీంకోర్టుకు కవిత

By narsimha lodeFirst Published Mar 17, 2023, 9:52 AM IST
Highlights

ఢిల్లీ  లిక్కర్ స్కాంలో  ఈడీ  నోటీసులు జారీ చేయడంతో  మరోసారి  సుప్రీంకోర్టును  ఆశ్రయించనున్నారు  కల్వకుంట్ల కవిత.  ఈ నెల  20న విచారణకు  రావాలని  కవితకు  నిన్న ఈడీ నోటీసులు జారీ 
 చేసింది. 

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత  శుక్రవారంనాడు  సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.   తన పిటిషన్ ను  త్వరగా  విచారణ చేయాలని  సుప్రీంకోర్టును కోరనుంది కవిత.  ఈ నెల  20వ తేదీన  విచారణకు  రావాలని కవితకు  ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో  సుప్రీంకోర్టు ను  ఆశ్రయించనున్నారు కవిత

ఢిల్లీ లిక్కర్  స్కాంలో  ఈ నెల 11వ తేదీన  తొలిసారిగా  ఈడీ విచారణకు  కవిత హాజరయ్యారు.  ఈ నెల  16వ తేదీన కవిత  రెండో దఫా ఈడీ విచారణకు  హాజరు కావాల్సి ఉంది.  అయితే  నిన్న ఈడీ విచారణకు  కవిత హాజరు కాలేదు.  ఈడీ అడిగిన  సమాచారాన్ని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి  సోమా భరత్ ద్వారా కవిత  ఈడీ  కార్యాలయానికి  పంపారు. అంతేకాదు  తాను  విచారణకు  హాజరు కాలేనని ఈడీకి లేఖ పంపారు.  సుప్రీంకోర్టులో  తన పిటిషన్  ఉందని  ఆ లేఖలో  పేర్కొన్నారు.  

సుప్రీంకోర్టు  నిర్ణయం వచ్చిన తర్వాత విచారణకు  హాజరు కానున్నట్టుగా  ఆ లేఖలో  ఆమె  పేర్కొన్నారు.  కానీ, ఈ లేఖను  అందుకున్న ఈడీ అధికారులు  నిన్న  మరోసారి కవితకు  సమన్లు  పంపారు.  ఈ నెల  20వ తేదీన  విచారణకు రావాలని  ఆదేశించారు.  ఈ నోటీసుల నేపథ్యంలో  కవిత  ఇవాళ  సుప్రీంకోర్టును  ఆశ్రయించే అవకాశం ఉంది.

ఈ నెల 15వ తేదీనే  కవిత  సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు  చేసిన విషయం తెలిసిందే. ఈడీ విచారణపై స్టే  కోరారు.  మహిళలను ఈడీ అధికారులు  విచారించడాన్ని ఆ పిటిషన్ లో  సవాల్  చేశారు.  ఈ పిటిషన్ పై ఈ నెల  24న విచారణ  చేయనున్నట్టుగా  సుప్రీంకోర్టు తెలిపింది.   తాజాగా  ఈడీ నోటీసులు జారీ చేయడంతో  ఇవాళ  సుప్రీంకోర్టును  కవిత  ఆశ్రయించే  అవకాశం ఉంది.
 

click me!