
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన వేళ సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ మహాధర్నాలు చేపట్టింది. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏప్రిల్ 8వ తేదీన సింగరేణి వ్యాప్తంగా మహాధర్నాలు చేపట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భూపాలపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం, మందమర్రి, నస్పూర్, ఇల్లందులో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మహా ధర్నాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ అనుంబంధ కార్మిక సంఘంతో పాటు పలు కార్మిక సంఘాలు కూడా ఈ ధర్నాల్లో పాల్గొంటున్నాయి.
ధర్నాల్లో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. మోదీ హటావో సింగరేణి బచావో అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు పలుచోట్ల సింగరేణి భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ల వద్ద టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఇదిలా ఉంటే.. సింగరేణిని ప్రైవేటీకరించబోమని రామగుండంలో ప్రధాని మోదీ చేసిన హామీని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రైవేటీకరణ చేయబోమని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. లాభాల్లో ఉన్న సింగరేణిని ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలన్న సీఎం కేసీఆర్ ఆశయాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఏప్రిల్ 8న సింగరేణి ఏరియాల్లో మహాధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.