నేనేం తక్కువ చేశా.. పాలిచ్చే గేదెను వద్దని దున్నపోతును తెచ్చుకున్నారు : కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 13, 2024, 6:29 PM IST
Highlights

రైతుబంధు ఇవ్వడం కూడా చాతకావడం లేదా ఇంత దద్దమ్మలా అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కేసీఆర్‌ను నల్గొండలో తిరగనివ్వరా.. కేసీఆర్ చంపి మీరు వుంటారా అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇది రాజకీయ సభ కాదు.. పోరాట సభ అన్నారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. మంగళవారం నల్గొండలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. కృష్ణాజలాలు మన జీవనర్మరణ సమస్య అన్నారు. బీఆర్ఎస్ వచ్చాక నల్గొండను ఫ్లోరైడ్ రహితంగా మార్చుకున్నామని.. భగీరథ నీళ్లతో ఫ్లోరైడ్ బాధలు పోయాయన్నారు. మా బతుకు ఇది అని చెప్పినా గతంలో ఏ పార్టీ పట్టించుకోలేదని కేసీఆర్ గుర్తుచేశారు.

కొందరు సన్నాసులు తెలివిలేక ఈ సభ వారికి వ్యతిరేకం అనుకుంటున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదన్నారు.. గతంలో ఫ్లోరైడ్‌తో నల్గొండ జిల్లా వాసుల నడుములు వంగిపోయాయని కేసీఆర్ గుర్తుచేశారు. మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవరూ మన రక్షణకు రారని ఆయన అన్నారు. ఇది కొంతమందికి వ్యతిరేకంగా పెట్టిన సభ కాదని కేసీఆర్ పేర్కొన్నారు. 

Latest Videos

పదేళ్లలో నేనేం తక్కువ చేయలేదని.. ఓటు సమయంలో నంగనాచి కబుర్లు చెబుతారని, తర్వాత ఎవరూ రారన్నారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా ప్రజల జీవన్మరణ సమస్య ఇదని కేసీఆర్ అన్నారు. మన నీళ్లు కాజేద్దామనుకునే స్వార్ధపరులకు ఈ సభ ఓ హెచ్చరిక అని.. ఎక్కడి నుంచో కరెంట్ తెప్పించి విద్యుత్ కోతలు లేకుండా చేశామని ఆయన గుర్తుచేశారు. బస్వాపూర్ పూర్తయ్యిందని.. దిండి ప్రాజెక్ట్ కూడా పూర్తి కాబోతోందని కేసీఆర్ తెలిపారు.

నా గడ్డ, నా ప్రజలు, నా ప్రాంతం అనుకుంటే ఏమైనా సాధించొచ్చునని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు వందలకొద్డీ కేసులు వేసినా ముందుకెళ్లామని కేసీఆర్ చెప్పారు. ఇది చిల్లరమల్లర రాజకీయ సభ కాదని.. గోదావరి , కృష్ణా కలిపి మంచిగా నీళ్లు తెచ్చుకున్నామని ఆయన వెల్లడించారు. పాలమూరు ఎత్తిపోతల పూర్తయితే పాలమూరు, వికారాబాద్, రంగారెడ్డి ప్రజలకు లబ్ధి కలుగుతుందని కేసీఆర్ తెలిపారు. 

వారం రోజులు లోక్‌సభను అడ్డుకున్నాం, స్తంభింపజేశామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం చెబితేనే కేసు విత్ డ్రా చేసుకున్నామని.. కేంద్రంతోనూ కొట్లాడి ప్రాజెక్ట్‌లపై ముందుకు సాగామని కేసీఆర్ వెల్లడించారు. మీరు పాలిచ్చే గేదెను వదిలి దున్నపోతును తెచ్చుకున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేం చలో నల్గొండ అనగానే అర్జంటుగా బట్జెట్‌ను పక్కకుపెట్టి సభలో తీర్మానం పెట్టారని కేసీఆర్ అన్నారు.

తాము ప్రజల్లోనే తేల్చుకుంటామని చలో నల్గొండకు పిలుపునిచ్చామని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రమే బాగుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని.. ప్రజల హక్కులు గాలికి వదిలేసి అసెంబ్లీలో దుర్మార్గంగా మాట్లాడుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం కంటే నాలుగు మంచి పనులు చేయాలని .. కేసీఆర్‌ను తిడితే కాంగ్రెస్ నేతలు పెద్దోళ్లు అవుతారా అని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతను ప్రజలు మాకు ఇచ్చారని.. ఎక్కడికక్కడ నిలదీస్తామని కేసీఆర్ తెలిపారు. రైతుబంధు ఇవ్వడం కూడా చాతకావడం లేదా ఇంత దద్దమ్మలా అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చేసిన తీర్మానంలో సాగునీరు అన్నారు.. కరెంట్ ఉత్పత్తి సంగతి మరచిపోయారని కేసీఆర్ దుయ్యబట్టారు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదని, తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతమని ఆయన పేర్కొన్నారు.

దద్దమ్మలు , చేతగాని చవటలు వుంటే ఇంతే అవుతుందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. మేం ఏం చేశామో తెలంగాణ ప్రజలు కళ్లారా చూశారని .. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టాలంటారా.. ఎన్ని గుండెలురా మీకు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 24 గంటల కరెంట్ ఇచ్చామని.. కేసీఆర్ ప్రభుత్వం పోగానే మళ్లీ కరెంట్ కోతలు మొదలయ్యాయని ధ్వజమెత్తారు. అసెంబ్లీలోనూ జనరేటర్ పెట్టారంటూ దుయ్యబట్టారు.

నీటిదురుసుతో మాట్లాడతారా.. చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా వుంటాయన్నారు. కేసీఆర్‌ను నల్గొండలో తిరగనివ్వరా.. కేసీఆర్ చంపి మీరు వుంటారా అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పులిలా పోరాడతా తప్పించి.. పిల్లిలా వెనకడుగు వేయనని కేసీఆర్ స్పష్టం చేశారు. తాము వున్నప్పటి కంటే 5,600 మెగావాట్ల పవర్ అధికంగా వున్నా.. పవర్ కట్స్ ఎందుకు వున్నాయని ఆయన ప్రశ్నించారు. రైతుల చెప్పులు బందోబస్తుగా వుంటాయని ఒక్క చెప్పుదెబ్బతో మూడు పళ్లు పోతాయని హెచ్చరించారు. 

మాయమాటలు చెప్పి తిరగాలని అనుకుంటున్నారా తిరగనివ్వం జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. బ్రిజేష్ ట్రిబ్యూనల్‌లో మన వాటా మనకు దక్కే వరకూ పోరాడాల్సిందేనని కేసీఆర్ పిలుపునిచ్చారు. మీకు చేతకాకపోతే.. కావట్లేదని చెప్పాలన్నారు. అసెంబ్లీ అయ్యాక మేము కూడా మేడిగడ్డ వెళ్లి మీ చరిత్ర బయటపెడతామని కేసీఆర్ పేర్కొన్నారు. వెంటపడతాం.. వేటాడతాం.. వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు. మరో 2 , 3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వుంటాయని కేసీఆర్ పేర్కొన్నారు.

చావుదాకా పోయి తెలంగాణ తెచ్చానని.. ఆ తపన, ఆవేదన తనకు వున్నాయన్నారు. రైతుబంధు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం మీది అంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్‌లో ఒక్క పిల్లర్ కుంగితే ఏమైందరి అని ఆయన ప్రశ్నించారు. మన న్యాయపరమైన హక్కులపై పోరాటానికి సిద్ధంగా వుండాల్సిందే, అన్ని పార్టీల నాయకులకు ఢిల్లీకి తీసుకెళ్లాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. 24 ఏళ్లుగా ప్రజల్లోనే వున్నా.. ఇప్పుడు అపోజిషన్‌లో రెస్ట్ తీసుకుందామనుకున్నా కుదరనివ్వట్లేదన్నారు. 

click me!