
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా మహబూబ్నగర్లో నిర్వహించనున్న బహిరంగ సభలో నడ్డా పాల్గొనున్నారు. జనం గోస- బీజేపీ భరోసా పేరుతో బీజేపీ ఈ సభను నిర్వహించనుంది. తెలంగాణ పర్యటనలో భాగంగా.. రేపు మధ్యాహ్నం 12.40 గంటలకు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మహబూబ్నగర్కు వెళ్లనున్నారు.
మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5 గంటల వరకు బీజేపీ ఆఫీసు బేరర్స్తో జేపీ నడ్డా సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మహబూబ్నగర్లో బీజేపీ నిర్వహించే సభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. ఇక, మహబూబ్నగర్ సభకు జేపీ నడ్డా హాజరుకానున్న నేపథ్యంలో భారీగా జనసమీకరణ చేయడంపై రాష్ట్ర బీజేపీ నాయకులు దృష్టి సారించారు. కనీవినీ ఎరగని రీతిలో జేపీ నడ్డా సభను సక్సెస్ చేద్దామని, పాలమూరు గడ్డ బీజేపీ అడ్డా అని బండి సంజయ్ అన్నారు. బీజేపీ కార్యకర్తల సత్తా చూపాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా మండలాలు, గ్రామాలు, బూత్ ల వారీగా జన సమీకరణపై దృష్టి సారించి సభను విజయవంతం చేయాలన్నారు.
ఇక, బండి సంజయ్ ఏప్రిల్ 14న తన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. గద్వాల్ జిల్లాలోని అలంపూర్లోని జోగులాంబ దేవి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత తన పాదయాత్రను ప్రారంభించారు. ఉద్యోగాలు, సాగునీరు, రైతులకు రుణ మాపీ, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు వంటి హామీలను టీఆర్ఎస్ సర్కార్ నెరవేర్చలేదని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల కోసం పోరాడేందుకు కుమార్ తన పాదయాత్రను చేపట్టారని వారు తెలిపారు.
ఇక, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నేటితో 21వ రోజుకు చేరింది. నేడు మన్యంకొండ అలివేలు మంగ ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. నేడు బండి సంజయ్ పాదయాత్ర మహబూబ్ నగర్ గ్రామీణ మండల్లాలో కొనసాగుతుంది. రేపు జరిగే సభలో జేపీ నడ్డా పాల్గొననున్న నేపథ్యంలో.. తెలంగాణలో పార్టీకి మరింత ఊపు వస్తుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మే 14వ తేదీన ముగియనుంది. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.