ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. మరికాసేపట్లో పరేడ్ గ్రౌండ్స్‌కి మోడీ

Siva Kodati |  
Published : Jul 03, 2022, 04:50 PM ISTUpdated : Jul 03, 2022, 04:57 PM IST
ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. మరికాసేపట్లో పరేడ్ గ్రౌండ్స్‌కి మోడీ

సారాంశం

హెచ్ఐసీసీలో జరుగున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. దీంతో నేతలంతా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. మరికాసేపట్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న బహిరంగ సభకు ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా చేరుకుంటారు.   

హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో గత రెండు రోజులుగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇవాళ్టీతో ముగిశాయి. ఈ సందర్భంగా దేశంలోని పరిణామాలు , రాజకీయ పరిస్ధితులపై నేతలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇక చివరి రోజున తెలంగాణలోని పరిస్ధితులపైనా నేతలు చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణపై ప్రకటన విడుదల చేసింది బీజేపీ. 

తెలంగాణ ఏర్పాటు లక్ష్యం నెరవేరలేదని.. నీళ్లు, నిధులు, నియామకాలు జరగలేదని ప్రకటనలో తెలిపింది. అలాగే బలహీనంగా వున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన అంశంపై చర్చ జరిగినట్లుగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. సమావేశాలు ముగిసిన వెంటనే నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. మరికొద్దిసేపట్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ పడ్డా తదితరులు చేరుకోనున్నారు. 

ALso Read:ప్రత్యేక రాష్ట్ర లక్ష్యం నెరవేరలేదు.. తెలంగాణపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చ

మరోవైపు ... తెలంగాణ కోసం చాలా మంది త్యాగాలు చేశారని.. ప్రజలు పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటై ఆంకాక్షలు నెరవేరతాయని యువతరం భావించిందన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా  తెలంగాణ అంశంపై చర్చించారు. అనంతరం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో (kishan reddy) కలిసి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు. పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇప్పటికీ నెరవెరలేదన్నారు. 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. 

తెలంగాణ ప్రజల కష్టాలు పెరుగుతున్నాయని అన్నారు. తెలంగాణలో రైతులు, యువకులు , దళితులు అందరూ కష్టాల్లో ఉన్నారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎవరైతే పోరాడారో వారు నేడు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. నీళ్లు, నిధులు, నియమాకాలు.. నినాదంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగిందని గుర్తుచేశారు. కానీ తెలంగాణలో ఇప్పటికీ నిరుద్యోగ సమస్య ఉందన్నారు. 

8 ఏళ్లుగా కేంద్రం తెలంగాణకు ఎన్నో నిధులు ఇచ్చిందని పీయూష్ గోయల్ చెప్పారు. కేంద్రం నిధులను తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 40 వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు పెంచారని చెప్పారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిందని చెప్పారు. దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సొంతం చేసుకుందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పారు.  తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేసేందుకు బీజేపీ నాయకత్వం కృషి చేస్తుందన్నారు. 

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని విమర్శించారు. బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై భారీగా జరిమానాలు వేశారని అన్నారు. టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. తెలంగాణలో రెండు రోజులుగా ఏం జరుగుతుందో అంతా చూశారని చెప్పారు. తమ సమావేశాలకు కౌంటర్ ఇవ్వాలని ఎన్ని డబ్బులు ఖర్చు చేస్తుందో మీరంతా చూశారని అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ స్టీరింగ్ అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఉందని ఆరోపించారు. ప్రగతి భవన్‌లోకి మంత్రులు ఎవరికీ ప్రవేశం లేదని అన్నారు. కానీ అసదుద్దీన్ ఒవైసీ మాత్రం బైక్ వేసుకుని సీఎం వద్దకు నేరుగా వెళ్తారని విమర్శించారు.. నెలలో 20 రోజులు సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లోనే ఉంటున్నారని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu