నాతో పెట్టుకోవద్దు.. మాడి మసైపోతావ్, నయీంకే భయపడలేదు : కేసీఆర్‌కు ఈటల వార్నింగ్

By Siva KodatiFirst Published Jun 27, 2023, 4:45 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ . నయీం లాంటి వాడికే తాను భయపడలేదని.. తన జాతి భయపడేది కాదన్నారు. ఈటలతో పెట్టుకుంటే మాడిమసై పోతారని హెచ్చరించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈటలతో పెట్టుకుంటే మాడిమసై పోతారని హెచ్చరించారు. తన జాతి తిరగబడే జాతని.. ఆత్మాభిమానంపై దెబ్బ పడితే ఊరుకోబమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సచివాలయంలోకి పాస్‌లు లేకుంటే ఎమ్మెల్యేలు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. చివరికి పత్రికా విలేకరులకు కూడా  ఎంట్రీ లేకపోవడంతో స్వేచ్ఛగా వార్తలు సేకరించలేకపోతున్నారని.. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇలా జరగలేదని ఈటల ఎద్దేవా చేశారు. 

కేసీఆర్‌కు ధరణి డబ్బుల పంట పండిస్తోందని రాజేందర్ ఆరోపించారు. ధరణి వచ్చాక పేదల భూములు మాయమవుతున్నాయని.. బ్రోకర్లు పెరిగిపోయారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణలో ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా గెలిస్తే బీఆర్ఎస్, లేదంటే బీజేపీ మరో పార్టీకి ఛాన్స్ లేదని రాజేందర్ తెలిపారు. రాష్ట్రంపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టిందని.. ఈసారి కేసీఆర్‌కు ఓటేయ్యొద్దని ఈటల హెచ్చరించారు. బీఆర్ఎస్‌కు ఈసారి డిపాజిట్లు కూడా దక్కవని రాజేందర్ జోస్యం చెప్పారు. 

ALso Read: ఈటల రాజేందర్‌ను హత్య చేసేందుకు కుట్ర.. : జమున సంచలన ఆరోపణ

కౌలు రైతులకు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారికి న్యాయం చేయడం లేదన్నారు. ఇకనైన సీఎం కేసీఆర్ ఆకాశం నుంచి భూమి మీదకు దిగి రావాలంటూ ఆయన చురకలంటించారు. మీడియా, పేపర్లను గుప్పిట్లో పెట్టుకుని తామే గొప్ప అని ప్రచారం చేస్తున్నారని.. ఈసారి జనం కేసీఆర్‌కు కర్రు కాల్చి వాతపెడతారని రాజేందర్ జోస్యం చెప్పారు. చిత్తుగా ఓడించారనే కక్షతో హుజురాబాద్ ప్రజలపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇందుకోసం భారీ కుట్ర జరుగుతోందని రాజేందర్ పేర్కొన్నారు. 

కేసీఆర్‌కు వెనుకబడిన , చిన్న కులాలంటే చులకన అన్నారు. రాష్ట్రంలో ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నారని.. ముదిరాజ్‌లతో పెట్టుకుంటే ఎవరూ బాగుపడలేదని ఈటల హెచ్చరించారు. ఇప్పటి వరకు జరిగిన దానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని రాజేందర్ డిమాండ్ చేశారు. సీఎం స్పందించే వరకు తమ నిరసన కొనసాగుతూనే వుంటుందన్నారు. గత కొంతకాలంగా కొందరు నేతలు తనను జాగ్రత్తగా వుండాలని హెచ్చరిస్తున్నారని రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు .

ఉద్యమం సమయంలో నయీం గ్యాంగ్ తన డ్రైవర్‌ను కిడ్నాప్ చేసిందని, తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని ఈటల తెలిపారు. దీనిపై అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికే తనతో పెట్టుకోవద్దని వార్నింగ్ ఇచ్చానని రాజేందర్ తెలిపారు. నయీం లాంటి వాడికే తాను భయపడలేదని.. తన జాతి భయపడేది కాదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము ప్రజల్లోనే  వుంటున్నామని, మమ్మల్ని వాళ్లే కాపాడుకుంటారని ఈటల రాజేందర్ తెలిపారు. బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారని.. సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు బిల్లులు అందనివ్వడం లేదని ఆయన ఆరోపించారు. 

click me!