తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో కమ్యూనిస్టు పార్టీలు లేవని అన్న కేసీఆర్.. ఇప్పుడు వాళ్లనే పక్కన పెట్టుకున్నారని విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో కమ్యూనిస్టు పార్టీలు లేవని అన్న కేసీఆర్.. ఇప్పుడు వాళ్లనే పక్కన పెట్టుకున్నారని విమర్శించారు. కేసీఆర్ అందితే జుట్టు లేకుంటే కాళ్లు పట్టుకుంటారని మండిపడ్డారు. లెఫ్ట్ పార్టీ నేతలతో ప్రధాని మోదీ సభను అడ్డుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ, సీపీఎం నాయకులు కేసీఆర్ భ్రమలో పడొద్దని.. ఆయన మాయమాటలు నమ్మొద్దని సూచించారు. లెఫ్ట్ పార్టీలు ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని అన్నారు.
ప్రధాని మోదీని రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంటామని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్.. మోదీ పర్యటనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని చెప్పారు. తెలంగాణలోని చైతన్యాన్ని కేసీఆర్ నాశనం చేశారని విమర్శించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తేందుకు ప్రతిపక్షాలు లేకుండా చేశారని మండిపడ్డారు.
సకాలంలో రైతులకు ఎరువులు అందించాలనే ఉద్దేశ్యంతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేసేందుకు ప్రధాని మోదీ రామగుండంకు వస్తున్నారని చెప్పారు. తెలంగాణలో రైతుల పండించిన వడ్లు కొనే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.