
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో బీజేపీ నేతలపై ఆరోపణలు రావడం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి మచ్చలేని తనపై విపరీత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి సీబీఐపై నమ్మకం లేకపోతే న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఢిల్లీ నాయకత్వానికి వివరిస్తున్నామని చెప్పారు. తెలంగాణ చక్కని వాతావరణం కల్పించాలని కోరుతున్నట్టుగా తెలిపారు. కేసీఆర్కు భయం పట్టుకుంది.. అందుకే ప్రశాంత్ కిషోర్ను తెచ్చుకన్నారని అన్నారు. పీకే వచ్చి చేసేది ఏమి లేదని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమకారులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. మహబూబ్ నగర్ నుంచి కార్యకర్తలు ఢిల్లీకి వస్తే తన ఇంటికి వచ్చేవారని తెలిపారు. ఉద్యమ కాకులకు వసతి కల్పించడం తన బాధ్యత అని అన్నారు. గత నెల 26న మున్నూరు రవి ఢిల్లీలోని తన నివాసానికి వచ్చినట్టుగా చెప్పారు. మున్నూరు రవి టీఆర్ఎస్ పార్టీకి చెందినవాడేనని తెలిపారు. వ్యక్తిగత పనుల నిమిత్తం మున్నూరు రవి ఢిల్లీకి వచ్చాడని తన పీఏ చెప్పాడని జితేందర్ తెలిపారు.
వసతి కల్పించాలని మున్నూరు రవి కోరితే తన ఇంట్లో వసతి కల్పించినట్టుగా జితేందర్ రెడ్డి వెల్లడించారు. మున్నూరు రవిపై ఎక్కడ ఎలాంటి ఆరోపణలు లేవని అన్నారు. మున్నూరు రవితో పాటు ఢిల్లీకి ఎవరు వచ్చారో తనకు తెలియదని చెప్పారు. 28వ తేదీన రవి వెళ్లిపోయాడు. పోలీసులు న్యాయంగా డ్యూటీ చేయాలని కోరారు. మున్నూరు రవికి ఎలాంటి క్రిమినల్ బ్యాగ్రౌండ్ లేదని చెప్పారు. తాను విచారణకు సిద్దమేనని తెలిపారు.
కేసీఆర్ కొత్త డ్రామా..
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర అనేది పచ్చి అబద్దమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆమె బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. మంత్రి హత్య కుట్ర కేసు డ్రామాకు సీఎం కేసీఆరే మూలం అని అన్నారు. మొదటి ముద్దాయిగా కేసీఆర్ ను..రెండవ ముద్దాయిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ను చేర్చాలన్నారు. కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. మంత్రి హత్యకు కుట్రపై పూర్తి స్థాయి విచారణ జరగాలన్నారు. నిందితుల ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. పోలీసుల అదుపులో ఉన్నవారంతా.. ఒకప్పుడు మంత్రి శ్రీనివాస్ రెడ్డి అనుచరులేనన్నారు డీకే అరుణ.