
సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సోదరుడు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బిజెపి లోకి లాగేందుకు కొంత మంది తెలంగాణ బిజెసి నాయకులు పార్టీ మీద వత్తిడి తెస్తున్నట్లు తెలింది. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి సోదరులు ఇమడలేకపోతున్నారని, ఇపుడున్న నాయకత్వంలో వారు ఏమాత్రం సంతృప్తి కరంగా లేరని అందువల్ల వారిని బిజెపి వైపు లాక్కోవడానికి అనువయిన సమయమిదేనని తెలంగాణా నాయకులు పార్టీ నాయకత్వానికి సమాచారం చేరవేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు ఇపుడున్న నాయకత్వంతో మంచిసంబంధాలు లేవు. ఏనాయకుడితో వారికి పొసగడం లేదు. దానికి తోడు వారు పిసిసి నాయకత్వంపై కన్ను వేశారు. అంతేకాదు, వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ముందుకెళ్లాలనేది వారి యోచన. దీనికి కాంగ్రెస్ నాయకత్వంనుంచి సమ్మతి లేదు.ఇపుడున్న ఏర్పాటును ఏమాత్రం మార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోవడం లేదు.
ఇక ఇక్కడ, కాంగ్రెస్ ను వదిలేసి ఎటుపోవాలన్నది కోమటిరెడ్డి బ్రదర్స్ తేల్చుకోలేకపోతున్నారు.టిఆర్ ఎస్ లోకి వెళి బిజినెస్ పరంగా ఒకె . కాని, రాజకీయంగా కెకె, డి. శ్రీనివాస్ ల్లాగా జీరో లవుతారు. ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడే స్వేచ్ఛ ఉండదు. మాట్లాడితే, కెసిఆర్, కెటిఆర్ ల ప్రస్తావన లేకుండా మాట్లాడటం కష్టం. అంతేకాదు, ముఖ్యమంత్రి కావాలన్న కోరిక బిజెపి లేదా కాంగ్రెస్ లోనే నెరవేరుతుంది. టిఆర్ ఎస్ లో ఆ మాట ఎత్తడమే నేరం. టిఆర్ ఎస్ అభిలషనీయం కాదు.
కోమటిరెడ్డి బ్రదర్స్ ఎదుర్కొంటున్న ఈ సంకట పరిస్థితిని బిజెపి నాయకులు గమనిస్తూ వస్తున్నారు. ముందస్తు ఎన్నికల సూచనలు కనిపిస్తున్నందున తొందరగా గాలం వేస్తే బాగుంటుందని కొంతమంది సీనియర్ నాయకులు బిజెపి అధిష్టానికి తెలియచేసినట్లు విశ్వసనీయంగాతెలిసింది. ఇప్పటికే ఆంధ్రలో కొంత రెడ్డినేతలను బిజెపి వైపులాగేందుకు చర్యలు మొదలయ్యాయి. తెలంగాణాలో ప్రముఖలను పార్టీలోకి తీసుకువస్తే ఎన్నికల్లో భారం పడదని వారు భావిస్తున్నారు.
అయితే, కోమటిరెడ్డి బ్రదర్స్ బిజెపిలోకి చేరడం మీద సంశయం వ్యక్తం చేసే వారు కూడా తెలంగాణ బిజెపిలో ఉన్నారు. ‘ కోమటిరెడ్డి బ్రదర్స్ కు చాలా పెద్ద డిమాండ్లు ఉన్నాయి.వాళ్లకి పార్టీ నాయకత్వం కావాలి. ముఖ్యమంత్రి పదవులు కావాలి. ఇలాంటి డిమాండ్లతో ముందుకెళ్లడం కష్టం,’ అని మరొక సీనియర్ నాయకుడు ‘ఏషియానెట్-తెలుగు’కు చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి బిజెపి అధిష్టానంలో చర్చ జరుగుతూ ఉందని ఆయన అంగీకరించారు.
ఈ మధ్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక ధపా ఢిల్లీ వెళ్లి వచ్చారు. కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి వచ్చారని చెబుతున్నారు. తొందరలో వారికి బిజెపి అధిష్టానం నుంచి పిలుపు వచ్చే లా బిజెపిలో ఒక వర్గం తీవ్రంగా కృషి చేస్తూఉంది.