రైతుల కోసం 72 గంటల పాటు దీక్షకు దిగుతున్నా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

By Siva KodatiFirst Published Sep 6, 2022, 4:19 PM IST
Highlights

రైతు సమస్యల పరిష్కారం కోసం త్వరలో 72 గంటల పాటు దీక్షకు దిగుతున్నట్లు తెలిపారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నాడు తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశానని ... పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతుల కోసం దీక్ష చేస్తానని ఆయన స్పష్టం చేశారు. 
 

రైతు సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా పోరాటం చేస్తానన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాడు తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశానని గుర్తుచేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతుల కోసం దీక్ష చేస్తానని.. త్వరలో 72 గంటల పాటు దీక్ష చేస్తానని ఆయన స్పష్టం చేశారు. 

ఇకపోతే.. కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 246ను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తోందన్నారు. ఈ జీవో వల్ల నల్గొండ జిల్లా ఏడారిగా మారుతుందని.. ఈ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు కేటాయించడంపై కోమటిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. నల్గొండ- మహబూబ్‌ నగర్ జిల్లాల మధ్య ప్రభుత్వం చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. జీవో నెంబర్ 246ని రద్దు చేయకపోతే తాను దీక్షకు దిగుతానని వెంకట్ రెడ్డి హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను తోడుకుపోతున్నా సీఎం పట్టించుకోవడం లేదని ఎంపీ మండిపడ్డారు. ఈ విషయంలో అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తానని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. 

ALso Read:జీవో నెం.246ని రద్దు చేయకుంటే ఉద్యమమే : కేసీఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అల్టీమేటం

అంతకుముందు కొద్దిరోజుల క్రితం ఇదే విషయమై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల మధ్య రక్తపాతం  జరిగితే కేసీఆరే బాధ్యత వహించాలని ఆయన కోరారు. ఎఎస్ఎల్‌బీసీకి  కేటాయించిన  నీటిని రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో తెచ్చిందన్నారు.  ఎస్ఎల్ బీసీకి 45 టీఎంసీలు కేటాయించిన విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. ఎస్ ఎల్ బీసీకి కేటాయించిన 45 టీఎంసీల నీటిని   పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. గతంలో ఎస్ఎల్ బీసీకి కేటాయించిన 45 టీఎంసీలను యధావిధిగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్ఎల్ బీసీ నల్గొండ జిల్లాకు సాగు తాగు నీరు అందించే ప్రాజెక్టు అని ఆయన గుర్తు చేశారు.
 

click me!