
హైదరాబాద్ లోని సంపన్నుల పిల్లలు చదివే పాఠశాలలపై డ్రగ్ మాఫియా చొరబడింది. 8వ తరగతి పిల్లల నుంచే డ్రగ్ సరఫరా చేస్తూ వారిని బానిసలుగా మారుస్తున్నారు. ఆడపిల్లలు సైతం 13, 14 ఏళ్లకే డ్రగ్ బానిసలుగా మారిపోతున్నారు. పోలీసు లెక్కల ప్రకారం హైదరాబాద్ నగరంలో వెయ్యి మంది చిన్నారులు డ్రగ్ బానిసలుగా మారిపోయినట్లు తెలుస్తోంది.
పోలీసులు వెల్లడించిన జాబితా ప్రకారం టాప్ రేంజ్ లో ఉన్న 19 పాఠశాలల్లో డ్రగ్ కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ స్కూల్స్ లిస్ట్ లో మీ పిల్లలు చదువుతున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ చదివితే మాత్రం వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ఒకవేళ నిజంగానే మీ చిన్నారులు డ్రగ్స్ వినియోగానికి బానిసైతే మాత్రం తక్షణమే వైద్యం అందించేందుకు అలక్ష్యం చేయొద్దు.
ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలోని 19 టాప్ మోస్ట్ స్కూల్స్ , 14 టాప్ ఇంజనీరింగ్, ఢిగ్రీ కళాశాలలు డ్రగ్ మాఫియా గుప్పిట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయా స్కూల్స్ పేర్లు కూడా బయటకొచ్చాయి. అయితే సమగ్ర సమాచారం లేకపోవడమే లేక సంపన్నుల పిల్లలు చదువుతున్న పాఠశాలలు కావడంతోనో కానీ ఆ జాబితాను పోలీసులు వెల్లడించడంలేదు. ప్రయివేటు విద్యాసంస్థలు కాబట్టి వారి పేర్లను వెల్లడించడంలో పోలీసులు వత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.
మొత్తం మీద ఈ స్కూల్స్, కాలేజ్ లతో పాటు మరికొన్ని విద్యాసంస్థల్లో కూడా డ్రగ్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు సేకరించిన లిస్టులో ఉన్న పాఠశాల విద్యార్థుల్లో మాత్రం ప్రతి 10 మందిలో ఇద్దరు నుంచి ముగ్గురు డ్రగ్స్ బానిసలుగా మారుతున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.