
నిజామాబాద్ బీజేపీలో పలువురు నేతలు అసంతృప్త గళాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ నేత, నిజామాబాద్ లోక్సభ సభ్యులు ధర్మపురి అరవింద్కు వ్యతిరేకంగా పలువురు నేతలు నిరసనలు కూడా చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ పార్టీకి జిల్లాలో భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జిగా ఉన్న పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ఆయన కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్తో విభేదాలు పెరిగిపోవడంతో వినయ్ కుమార్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్.. ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారని, ఆర్మూర్ లేదా కోరుట్ల నుంచి బరిలో నిలుస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అరవింద్ ఆర్మూర్ నుంచి పోటీ చేయాలని భావిస్తే.. అది వినయ్ కుమార్ రెడ్డికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వినయ్ కుమార్ రెడ్డి అనుచరులు కూడా ఆయనపై పార్టీ మారాలని.. కాంగ్రెస్లో చేరాలని ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా సమాచారం. ఇక, వినయ్ కుమార్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వర్గం నేతగా పేరుంది.
ఇక, వినయ్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 20 వేల ఓట్లు సాధించారు. ఇక, 2019 లోక్సభ ఎన్నికల్లో ఆర్మూర్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు 40 వేల ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి అరవింద్కు 72 వేల ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థిగా ఉన్న అరవింద్కు భారీగా ఓట్లు రాబట్టేలా చేయడంలో వినయ్కుమార్రెడ్డి కూడా కీలక పాత్ర పోషించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక, ఆర్మూర్ నియోజకవర్గంలో 12 మంది ఎంపీటీసీ సభ్యులు, ఆరుగురు మున్సిపల్ కౌన్సిలర్లు, ఐదుగురు సర్పంచ్లు, ఒక జడ్పీటీసీ సభ్యుడు బీజేపీ అభ్యర్థులుగా గెలుపొందారని వారు గుర్తుచేస్తున్నారు.