ఏపీ నుండి రూ.17,828 కోట్ల బకాయిలు,తప్పని నిరూపిస్తే రాజీనామా: కేసీఆర్

By narsimha lodeFirst Published Sep 12, 2022, 1:09 PM IST
Highlights

ఏపీకి నెల రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వం రూ. 6 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కానీ ఏపీ నుండి తెలంగాణకు రూ. 17,828 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. 
 


హైదరాబాద్:  నెల రోజుల్లోనే ఏపీకి రూ. 6 వేల కోట్లు చెల్లించాలని కేంద్రం ఆదేశించిందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.కానీ తెలంగాణకు ఏపీ నుండి రావాల్సిన బకాయిల విషయంలో కేంద్రం స్పందించలేదన్నారు. ఏపీ నుండి తమకు రూ., 17,828 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. తాను చెప్పేది అబద్దమని నిరూపిస్తే వెంటనే  రాజీనామా చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. 

ఏపీకి తాము రూ. 3వేల కోట్లు  అసలు 18 శాతం వడ్డీని కలిపి  రూ. 6 వేల కోట్లను 30 రోజుల్లోనే చెల్లించాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. తమకు రావాల్సిన బకాయిల నుండి రూ. 6 వేల కోట్లు తీసుకొని మిగిలిన డబ్బులను తమకు ఏపీ నుండి ఇప్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. ఏపీలోని కృష్ణపట్నం వంటి విద్యుత్ ప్రాజెక్టులో కూడా తెలంగాణకు వాటా ఉందని కేసీఆర్ చెప్పారు. తాను చెబుతున్న లెక్కలు తప్పైతే వెంటనే  తాను రాజీనామా చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. 

రాష్ట్రానికి రావాల్సిన  విద్యుత్ ను కేంద్రం ఇవ్వకపోతే అప్పుల చేసి రైతులకు విద్యుత్ ను ఇచ్చామని కేసీఆర్ చెప్పారు. విద్యుత్ కొనుగోలు కోసం రూ. 2466 కోట్లు ఖర్చు చేసినట్టుగా కేసీఆర్ వివరించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తైతే తెలంగాణలో మరింత విద్యుత్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారు. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణకు 25 వేల కోట్లఆర్ధిక లోటును ఎదుర్కొంటుందని కేసీఆర్ చెప్పారు. 

కేంద్రం తీసుకు రానున్న విద్యుత్ సవరణ చట్టంతో విద్యుత్ సంస్థకు చెందిన ఆస్తులను ప్రైవేట్ వారికి కట్టబెట్టనున్నారని చెప్పారు. అంతేకాదు ప్రైవేట్ సంస్థలు చెప్పిన చోటు నుండే మీటర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. 

also read:పోయే కాలం వచ్చింది, అధికారం నెత్తికెక్కి మాటలు: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీపై కేసీఆర్ ఫైర్

విద్యుత్ సంస్కరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టాలు చేయడం, వెనక్కి తీసుకోవడం మీకు అలవాటే కదా అని కేసీఆర్ కేంద్రంలోని మోడీ సర్కార్ పై సెటైర్లు వేశారు.రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకుని మోడీ క్షమాపణ  చెప్పిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.  విద్యుత్ సంస్కరణలతో విద్యుత్ సిబ్బంది ఉద్యోగాలు పోతాయని కేసీఆర్ చెప్పారు. ఉద్యోగులంతా సింహాల్లా ఈ విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కేసీఆర్ కోరారు. విద్యుత్ సబ్సిడీకి తాము మిమ్మల్ని డబ్బులు అడగామా అని కేసీఆర్ ప్రశ్నించారు.  విద్యుత్ సంస్కరణలను అడ్డుకొంటామని కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం చేస్తున్న అన్యాయాలపై చర్చకు తాను సిద్దంగా ఉన్నానని కేసీఆర్ ప్రకటించారు.

click me!