జలశక్తి బోర్డ్ ప్రయత్నాలు మళ్లీ విఫలం: కృష్ణా, గోదావరి పైనున్న ప్రాజెక్ట్‌లు ఇచ్చేది లేదన్న ఏపీ , తెలంగాణ

By Siva KodatiFirst Published Jul 13, 2022, 9:43 PM IST
Highlights

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదానికి కేంద్రం పుల్ స్టాప్ పెట్టే దిశగా అడుగులు వేసిన సంగతి తెలిసిందే. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను తమకు అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. అయితే ప్రాజెక్ట్‌లను ఇచ్చేది లేదని రెండు రాష్ట్రాలు తేల్చిచెప్పాయి. 
 

తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నదులపై వున్న ప్రాజెక్ట్‌లను కేంద్ర జలశక్తి బోర్డు (jal shakti board) పరిధిలోకి తీసుకునే ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి. తెలుగు రాష్ట్రాల మధ్య సాగునీటి వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసింది. జూలై 14, 2021 నుంచి కృష్ణా, గోదావరి నదులపై వున్న ప్రాజెక్ట్‌లను తమకు అప్పగించాలని కేంద్ర జలశక్తి బోర్డు ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. అయితే ప్రాజెక్ట్‌లను బోర్డు పరిధిలోకి ఇవ్వబోమని తెలంగాణ తేల్చిచెప్పింది. తెలంగాణ ఇస్తేనే తామూ ఇస్తామని ఏపీ ప్రభుత్వం సైతం మెలిక పెట్టింది. మరోవైపు ప్రాజెక్ట్‌ల అప్పగింతపై ప్రత్యేక బోర్డు విధించిన గడువు రేపటితో ముగియనుంది. 

కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదానికి కేంద్రం పుల్ స్టాప్ పెట్టే దిశగా అడుగులు వేసిన సంగతి తెలిసిందే. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులన్నీ ఇక నుండి ఆయా బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి. ఈ మేరకు 2021 జూలై 15న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ గెజిట్ నోటిఫికేషన్ అదే ఏడాది అక్టోబర్ 14 నుండి అమల్లోకి రానుందని కేంద్రం స్పష్టం చేసింది.

ALso Read:ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు ఆనకట్టలు: ఏపీపై కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

ఒక్కో రాష్ట్రం బోర్డుల నిర్వహణ కోసం రూ. 200 కోట్లు కేటాయించాలని కేంద్రం ఆదేశించింది. రెండు మాసాల్లో  ఈ నిధులను  జమ చేయాలని  కోరింది. అనుమతుల్లేని ప్రాజెక్టులన్నీ  ఆరు మాసాల్లోపుగా అనుమతులు తెచ్చుకోవాలని ఆదేశించింది. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ప్రాజెక్టులు పూర్తైనా  వాటిని నిలిపివేయాలి.

కృష్ణా నదిపై ఉన్న 36, గోదావరి పై 71 ప్రాజెక్టులను రెండు బోర్డుల పరిధుల్లోకి చేర్చింది. బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను చేర్చాలనే ప్రతిపాదనను మొదటి నుండి  తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఆయా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయకుండానే బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకురావడంపై తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.  తాజాగా కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ  బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకురావడంపై తెలంగాణ ప్రభుత్వం న్యాయశాఖ నిపుణులతో చర్చిస్తోంది.

click me!