
తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన హోంగార్డులు మంగళవారం లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిలను కలిశారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆమెకు మద్దతు తెలిపేందుకు ఒక్కొక్కరుగా లోటస్ పాండ్ లో షర్మిలను కలుస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా.. ఆంధ్రపాలిత హోంగార్డులు ఆమెను కలిశారు. ఈ క్రమంలో.. తమ బాధలను ఆమెకు విన్నవించుకున్నారు. తమను తెలంగాణ నుంచి ఏపీలో విధుల్లోకి తీసుకునే విధంగా జగన్ ప్రభుత్వంతో మాట్లాడాలంటూ షర్మిలకు విన్నవించారు. తెలంగాణలో పని చేస్తున్నా ఇప్పటికీ తమను స్థానికేతరులుగానే గుర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగా తమకు ఆప్షన్లు ఇవ్వలేదని, అందువల్ల ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని షర్మిల వద్ద హోంగార్డులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇక్కడ స్థానికేతరులుగా ఉండలేమని, తమను ఆంధ్రాలో విధుల్లోకి తీసుకునేలా సీఎం జగన్తో మాట్లాడాలని షర్మిలకు విజ్ఞప్తి చేశారు. హోంగార్డుల విన్నపంపై షర్మిల సానుకూలంగా స్పందించారు. హోంగార్డుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.