
కేంద్ర మంత్రి అమిత్ షాతో టాలీవుడ్ నటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో ఇద్దరు కలిసి విందు చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బీజేపీ అగ్రనేత అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ ఎందుకయ్యారనేది సర్వత్రా చర్చనీయంశంగా మారింది.
శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇతర బీజేపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ కు స్వాగతం పలికారు. ఆ తరువాత అమిత్ షా దగ్గరకు తీసుకెళ్లారు. అమిత్ షా, ఎన్టీఆర్ లు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ అద్భుత నటనను అమిత్ షా ప్రశంసించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి భేటీ దాదాపు అరగంట పాటు సాగింది.
సమావేశం అనంతరం ట్వీట్ చేస్తూ.. జూ.ఎన్టీఆర్ తో భేటీ కావడం ఆనందంగా ఉంది.'అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్తో ఈ రోజు హైదరాబాద్లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది' అని అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ వర్గాలు మాత్రం.. ఇది రాజకీయ భేటీ కాదని, స్నేహాపూర్వక భేటీనే బీజేపీ వర్గాలు చెప్పుతున్నా.. వీరిద్దరూ ఏ ఏ అంశాలపై చర్చించారనేది హాట్ టాఫిక్ గా మారింది.
మరోవైపు.. కేవలం జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కోసమే అమిత్ షా తన షెడ్యూల్ మార్పులు చేసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. షెడ్యూల్ ప్రకారం.. అమిత్ షా రాత్రి 10 గంటలకే ఢిల్లీకి పయనం అవ్వాల్సి ఉంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కావడంతో షెడ్యూల్ లో మార్పులు జరిగినట్టు సమాచారం.