ప్రభుత్వాన్ని గన్‌తో కాదు .. చట్టంతో నడపాలి : దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై అసదుద్దీన్‌ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 20, 2022, 7:59 PM IST
Highlights

దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని తుపాకీతో కాదు.. చట్టబద్ధంగా నడపాలని, ఎన్‌కౌంటర్లకు తాను వ్యతిరేకమని ఆయన తెలిపారు. 
 

దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని తుపాకీతో కాదు.. చట్టబద్ధంగా నడపాలని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్‌కౌంటర్లకు తాను వ్యతిరేకమని అసదుద్దీన్ స్పష్టం చేశారు. దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు వెలువరించిన నాడే అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది.

కాగా.. Disha Accused Encounter బూటకమని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి మాసంలో సుప్రీంకోర్టుకు Sirpurkar Commission తన నివేదికను అందించింది. దీని ఆధారంగా శుక్రవారం నాడు Supreme Court విచారణ నిర్వహించింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై పౌరహక్కుల సంఘం నేతలు సుప్రీంకోర్టులో అప్పట్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సిర్పూర్కర్ కమిషన్‌ను  సుప్రీంకోర్టు  ఏర్పాటు చేసింది. ఈ ఎన్ కౌంటర్ బూటకపు ఎన్ కౌంటర్ అని సిర్పూర్కర్ కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసిందని పౌరహక్కుల సంఘం తరపు న్యాయవాది కృష్ణ చెప్పారు. ఈ రిపోర్టు సారాంశం మాత్రం తమకు కోర్టులో చదివి విన్పించారన్నారు.

ఈ రిపోర్టు కాపీలను అందరికీ ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్ కౌంటర్ లేకపోతే కేసును సుప్రీంకోర్టు ఇక్కడే ముగించేదని న్యాయవాది కృష్ణ చెప్పారు. అయితే బూటకపు ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది కోరారు. తెలంగాణ హైకోర్టులో సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై విచారణ జరుగుతుందని న్యాయవాది చెప్పారు. పోలీసు అధికారులు సురేందర్, నరసింహారెడ్డి, షేక్ లాల్ మదర్, సిరాజుద్దీన్, రవి,వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్, జానకీరామ్, బాలు రాథోడ్, శ్రీకాంత్ లపై విచారణ జరపాలని కూడా సిర్పూర్కర్ కమిషన్ సూచించింది. అంతేకాదు  ఈ పోలీసు అధికారులపై ఐపీసీ 302, రెడ్ విత్ 34, 201, రెడ్ విత్ 302, 34 సెక్షన్ల కింద విచారణ జరపాలని కమిషన్ కోరింది.

ఇదిలా ఉంటే దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఇవాళ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఏమైనా అభ్యంతరాలుంటే హైకోర్టు ముందుంచాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది. 
 

click me!