
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితులకు బెయిల్ లభించింది. ఈ కేసులో ఏడుగురు నిందితులకు (ఏ1 నుంచి ఏ7) మేడ్చల్ సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిందితులు రూ. 40 వేలు పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో సంతకాల కోసం హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఏడుగురు నిందితులు చర్లపల్లి జైలులో ఉన్నారు. బెయిల్ మంజూరు కావడంతో ఈరోజు సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ బెయిల్ ప్రక్రియలో జాప్యం జరిగితే వారు రేపు విడుదల కానున్నారు.
ఈ కేసులో బెయిల్ కోసం నిందితులు మేడ్చల్ సెషన్స్ కోర్టులో రెండుసార్లు పిటిషన్ దాఖలు చేశారు. మొదటిసారి వేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేయగా.. రెండోసారి మళ్లీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ సంతర్భంగా పోలీసులు నిందితులకు బెయిల్ మంజూరు చేయవద్దని కౌంటర్ దాఖలు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇవ్వొద్దని, నిందితులు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని కోర్టు దృష్టికి తెచ్చారు. మరోవైపు నిందితుల పోలీస్ కస్టడీ ఇప్పటికే ముగిసినందున వారికి బెయిల్ మంజూరు చేయాలని నిందితుల తరఫు లాయర్ కోర్టును అభ్యర్థించారు. మార్చి 28న బెయిల్ పిటీషన్పై వాదనలు పూర్తికాగా.. న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. నేడు ఏడుగురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేసింది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ను హత్యకు కుట్ర జరిగినట్టుగా పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. మహబూబ్నగర్కు చెందిన యాదయ్య, విశ్వనాథ్, నాగరాజు.. సుపారీ గ్యాంగ్తో హత్య చేయాలని భావించినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకోసం ఫరూక్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చేందుకు యత్నించారని చెప్పారు. ఇందుకు సంబంధించి తొలుత నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరో ముగ్గురిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను మేడ్చల్ కోర్టులో ప్రవేశపెట్టగా.. రాఘవేందర్ రాజు, నాగరాజు, విశ్వనాథరావు, యాదయ్య, రవి, మధుసూదన్ రాజు, అమరేందర్ రాజులను పోలీసుల కస్టడీకి అనుమతించింది. పోలీసులు 10 రోజుల కస్టడీ కోరగా.. కోర్టు కేవలం 4 రోజులకు మాత్రమే అనుమతించింది.