
వికారాబాద్ : తెలంగాణలో వీధి కుక్కల వీరంగం ఇంకా అదుపులోకి రావడం లేదు. తాజాగా వికారాబాద్లో వీధి కుక్కలు హల్చల్ చేశాయి. జిల్లాలోని కుల్కచర్ల మండలం బొంరెడ్డిపల్లి గ్రామంలో ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచింది ఓ వీధి కుక్క. 12 ఏళ్ల శివకుమార్ రెడ్డి అనే బాలుడు పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా అతని మీద ఓ వీధి కుక్క దాడికి దిగింది. బాలుడి తండ్రి అనంతరెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. బాలుడు పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా కుక్క దాడి చేయడంతో అతడి ముఖం మీద తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే, గమనించిన స్థానికులు కుక్కని వెలగొట్టడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తల్లదండ్రులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న వారు.. అతడిని కుల్కచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. ఆ తరువాత అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు.
పెద్దపల్లిలో వీధికుక్క దాడి: మూడేళ్ల చిన్నారికి గాయాలు
ఇదిలా ఉండగా, ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలోని ఓ ఐదేళ్ల చిన్నారి రేబిస్ వ్యాధి లక్షణాలతో మృతి చెందాడు. మండలంలోని పుఠానితండాలో సోమవారం ఐదేళ్ల బాలుడురేబిస్ వ్యాధి లక్షణాలతో మృతి చెందాడు. ఆ చిన్నారి పేరు భరత్… బానోతు రవీందర్, సంధ్యల కుమారుడు. ఈ చిన్నారి రెండు నెలల క్రితం ఇంటిముందు ఆడుకుంటున్న సమయంలో గాయపడ్డాడు. అయితే తల్లిదండ్రులు సైకిల్ మీద పడడం వల్ల గాయపడ్డాడని అనుకున్నారు. దానికి మామూలు చికిత్స చేయించారు.
అయితే ఆదివారం నాడు ఉన్నట్టుండి బాలుడు అస్వస్థతకు గురయ్యాడు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు అది రేబీస్ వ్యాధి లక్షణాలుగా గుర్తించారు. అనుమాన నివృత్తి కోసం హైదరాబాదుకు తీసుకువెళ్లాలని తల్లిదండ్రులకు తెలిపారు. అది విని కంగారుపడ్డ తల్లిదండ్రులు వెంటనే బాలుడిని తీసుకొని ఆదివారం రాత్రి బస్సులో హైదరాబాద్కు బయలుదేరారు.
సూర్యాపేట సమీపంలోకి వచ్చేసరికి బాలుడు అనారోగ్యం తీవ్రం కావడంతో మృతి చెందాడు, ఈ హఠాత్ పరిణామానికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బాలుడి మృతి తట్టుకోలేక వారు చేస్తున్న రోదనలు మిన్నట్టుతున్నాయి. సోమవారం నాడు బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.