హైదరాబాద్‌తో రంగారెడ్డి పోటీ: కొత్తగా 1,524 కేసులు.. తెలంగాణలో 37 వేలు దాటిన సంఖ్య

By Siva KodatiFirst Published Jul 14, 2020, 10:24 PM IST
Highlights

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మంగళవారం 1,524 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో కేసుల సంఖ్య 37,745కి చేరింది

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మంగళవారం 1,524 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో కేసుల సంఖ్య 37,745కి చేరింది.

ఇవాళ వైరస్‌తో పది మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 375కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 12,531 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. ఇవాళ ఒక్కరోజే 1,161 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీటితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 24,840కి చేరింది.

మంగళవారం ఒక్క హైదరాబాద్‌లోనే 815 మందికి పాజిటివ్‌గా తేలగా.. ఆ తర్వాత రంగారెడ్డి 240, మేడ్చల్ 97, సంగారెడ్డి 61, నల్గొండ 38గా ఉన్నాయి. 

కాగా, తెలంగాణలో కోవిడ్ 19 నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణా పరీక్షలు చేయకపోవడంపై రాష్ట్ర హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా పరీక్షలు, బాధితులకు అందుతున్న చికిత్సపై ఉన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రిలోనూ కోవిడ్ పరీక్షలు జరపాలని ఆదేశించింది. కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించాలని సూచించింది.

కరోనా బాధితులకు 4 లక్షల రూపాయలకు పైగా బిల్లులు వేసిన యశోద, కిమ్స్ ఆసుపత్రులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే ప్రైవేట్ కేంద్రాల్లో అన్ని రకాల పరీక్షలకు గరిష్ట చార్జీలు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

click me!