హైదరాబాదీలకు ఆధార్ నోటీసులు.. ఎంతమంది ముస్లింలు ఉన్నారంటూ అసదుద్దీన్ ఫైర్

By telugu news teamFirst Published Feb 19, 2020, 2:16 PM IST
Highlights

నోటీసులో పౌరసత్వ వెరిఫికేషన్‌ అనే పదాన్ని ఉపయోగించారని, ఆధార్‌ వ్యాలిడిటీ గురించి ప్రస్తావించలేదని, ఈ నోటీసును జారీ చేసిన డిప్యూటీ డైరెక్టర్‌ను ఉడాయ్‌ సస్పెండ్‌ చేయాలని మరో ట్విట్టర్ పోస్టులో ఆయన కోరారు.


పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ ఆధార్ సంస్థ హైదరాబాద్ నగరంలోని దాదాపు 127మందికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఈ అంశంపై 
ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ స్పందించారు. ఆధార్ అలా నోటీసులు పంపడంపై  తెలంగాణ పోలీసులపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన... ఆ జాబితాలో ఎంతమంది దిళితులు, ముస్లింలు ఉన్నారంటూ ప్రశ్నించారు.

Aslo Read పౌరసత్వం నిరూపించుకోండి... హైదరబాదీలకు ఆధార్ షాక్...

ఆధార్‌ సంస్థ తన అధికారాలను దుర్వినియోగం చేసిందని, సరైన ప్రామాణికాలు అనుసరించకుండానే పక్షపాత వైఖరితో వ్యవహరించిందని ఆరోపించారు. కార్డన్‌ సెర్చ్‌ కార్యక్రమంలో ఆధార్‌ చూపమని అడగటం  పోలీసులు విరమించుకోవాలని, ఇలా చేయడానికి మీకు చట్టబద్ధ అనుమతి లేదని తెలంగాణ పోలీసులను ఉద్దేశించి అసదుద్దీన్ ట్వీట్‌ చేశారు.

నోటీసులో పౌరసత్వ వెరిఫికేషన్‌ అనే పదాన్ని ఉపయోగించారని, ఆధార్‌ వ్యాలిడిటీ గురించి ప్రస్తావించలేదని, ఈ నోటీసును జారీ చేసిన డిప్యూటీ డైరెక్టర్‌ను ఉడాయ్‌ సస్పెండ్‌ చేయాలని మరో ట్విట్టర్ పోస్టులో ఆయన కోరారు.

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)పై తీవ్ర దుమారం రేగుతున్న వేళ.. నగరంలోని పలువురికి ఆధార్ సంస్థ ఇలాంటి షాకివ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది.  తొలుత సత్తర్ ఖాన్ అనే వ్యక్తి కి నోటీసులు అందాయి.  నువ్వు భారత పౌరుడివి కాదని.. నకిలీ ధృవపత్రాలను సృష్టించి ఆధార్ కార్డ్ తీసుకున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని ఆధార్ సంస్థ పేర్కొంది.

ఈ నేపథ్యంలో భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 20న రంగారెడ్డిలోని బాలాపూర్‌లో ఎంక్వైరీ ఆఫీసర్ ఎదుట హాజరై అన్ని ఒరిజినల్ ధృవపత్రాలను చూపించాలని ఆదేశించింది. ఒకవేళ భారత పౌరుడివి కాకుంటే.. దేశంలోకి చట్టబద్ధంగా ప్రవేశించినట్లుగా నిరూపించుకోవాల్సి ఉంటుందని UIDIA తేల్చిచెప్పింది. 

ఒకవేళ విచారణ రాకుంటే సుమోటాగా తాము నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది. తొలుత ఒక్క వ్యక్తికి మాత్రమే నోటీసులు రాగా... తాజాగా చాలా  మందికి నోటీసులు అందినట్లు తెలుస్తోంది. కాగా.. యూఐడీఏఐకు పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదంటూ విమర్శలు వెల్లువెత్తడంతో సదరు అధికారులు స్పందించారు. కొంతమంది అక్రమ వలసదారులు తప్పుడు పత్రాలతో   ఆధార్ కార్డులు పొందారంటూ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే 127 మంది హైదరాబాదీలకు నోటీసులు పంపించామని వివరణ ఇచ్చారు. అక్రమ వలసదారులకు ఆధార్‌ మంజూరు చేయరాదని సుప్రీంకోర్టు చెబుతోందన్నారు.

ఇక ఆధార్‌ చట్టం ప్రకారం ఆధార్‌ కార్డుకు దరఖాస్తు చేయడానికి ముందు భారత్‌లో 182 రోజులపాటు నివసించాలన్న నిబంధన ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒరిజినల్‌ ధృవపత్రాలు సమకూర్చుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో విచారణను మే నెలకు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది

click me!