Telangana
ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ల పాలన ఒకే రకంగా ఉందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు.
వనపర్తి: ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ల పాలన ఒకే రకంగా ఉందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు.
సోమవారం నాడు ఉమ్మడి మహాబూబ్నగర్ జిల్లాలోని వనపర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు.సంపన్నుల కోసమే వీరిద్దరూ కూడ పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.మోడీకి కేసీఆర్ లంచాలు ఇస్తున్నాడని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాజెక్టు రీ డిజైన్ల పేరుతో డబ్బులు దండుకొన్నారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టుల రీ డిజైన్ల వల్ల కల్వకుంట్ల కుటుంబం బాగుపడిందని ఆయన అభిప్రాయపడ్డారు.
అబద్దాలు చెప్పడంతో పాటు విద్వేషాలు రెచ్చగొట్టడంలో మోడీకే తెలుసునని చెప్పారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని 2014 ఎన్నికల ముందు మోడీ హామీ ఇచ్చి ఒక్క పైసా కూడ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు ప్రతి నెల రూ. 12 వేల రూపాయాలను జమ చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రతి ఏటా రూ. 72వేలు ఇస్తామన్నారు. తమ పార్టీ బాగా ఆలోచించి ఈ పథకాన్ని రూపొందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మహిళల ఖాతాలోనే ఈ డబ్బులను జమ చేస్తామని ఆయన ప్రకటించారు.
చిన్న వ్యాపారులను కాంగ్రెస్ పార్టీ ఆదుకొంటుందని ఆయన హామీ ఇచ్చారు. నామ మాత్రంగా రుణ మాఫీ హామీలు ఇస్తే రైతుల జీవితాల్లో మార్పులు ఉండవని ఆయన చెప్పారు. ధనికులకు మాత్రమే మోడీ చౌకీదారుగా పనిచేస్తున్నాడని ఆయన ఆరోపించారు.
ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో మహిళలకు 33 శాతం సీట్లను కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ఎంపీలు మోడీకి బీ టీమ్గా పనిచేస్తున్నారని ఆయన విమర్శలు చేశారు.
సంబంధిత వార్తలు
కేసీఆర్ రిమోట్ కంట్రోల్ మోడీ చేతిలో: రాహుల్ గాంధీ