2024 ఒలింపిక్స్‌కి అర్హత సాధించిన నీరజ్ చోప్రా... ఒకే త్రో, రెండు రికార్డులు...

By Chinthakindhi RamuFirst Published Aug 25, 2023, 5:44 PM IST
Highlights

తన మొదటి ప్రయత్నంలోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చి, గ్రూప్ Aలో టేబుల్ టాపర్‌గా నీరజ్ చోప్రా... మొదటి త్రో తర్వాత మళ్లీ త్రో వేయకుండానే నిష్కమించిన నీరజ్.. 

టీమిండియా గోల్డెన్ బాయ్ నరీజ్ చోప్రా, ఒకే ఒక్క సూపర్ ‘త్రో’తో, 2024 పారిస్ ఒలింపిక్స్‌కి అర్హత సాధించాడు. అలాగే వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ జావెలిన్ త్రో ఫైనల్స్‌కి కూడా దూసుకెళ్లాడు.. పారిస్ ఒలింపిక్స్‌కి నేరుగా అర్హత సాధించేందుకు 85.50 మీటర్ల మార్కును అధిగమించాల్సి ఉంటుంది..

తాజాగా శుక్రవారం జరిగిన పోటీల్లో 88.77 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా, తన కెరీర్‌లో నాలుగో బెస్ట్ ఫిగర్‌ని నమోదు చేశాడు. క్వాలిఫైయింగ్ రౌండ్‌కి ముందు కొన్ని నిమిషాల ప్రాక్టీస్ మాత్రమే చేసిన నీరజ్ చోప్రా... తన మొదటి ప్రయత్నంలోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చి, గ్రూప్ Aలో టేబుల్ టాపర్‌గా నిలిచాడు..

నీరజ్ చోప్రా కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ 89.94 మీటర్లు. అయితే మొదటి త్రోనే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కి అర్హత సాధించడంతో మరో త్రో వేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు నీరజ్ చోప్రా. ఇదే గ్రూప్‌లో డీపీ మను రెండో ప్రయత్నంలో 81.31 దూరం విసిరాడు. 

కనీసం 83 మీటర్ల దూరం విసిరిన ప్లేయర్లు లేదా రెండు గ్రూపుల్లో టాప్ 12లో నిలిచిన బెస్ట్ జావెలిన్ త్రోయర్లు మాత్రమే ఫైనల్‌కి అర్హత సాధిస్తారు..

's🇮🇳 Neeraj Chopra qualifies for Paris Olympics 2024 and World Athletics Championship 2023 FINAL with a throw of 88.77m in his first attempt💪 pic.twitter.com/zayUncsRFG

— Doordarshan Sports (@ddsportschannel)

జూలై 1న జరిగిన లాసాన్ డైమండ్ లీగ్‌లో 87.66 మీటర్ల దూరం అందుకుని పసిడి నెగ్గిన నీరజ్ చోప్రా, మే నెలలో జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంకు సాధించాడు. అంతకుముందు దోహా డైమండ్ లీగ్‌లో, 2021 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి, చరిత్ర సృష్టించాడు..

2022 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రన్నరప్‌గా నిలిచిన నీరజ్ చోప్రా, గత రెండేళ్లుగా అడుగుపెట్టిన ప్రతీ చోటా భారత జెండా పాతేశాడు. క్రికెటర్లతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న నీరజ్ చోప్రాపై 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి, వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్ పసిడి నెగ్గిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా చరిత్ర లిఖించాడు నీరజ్ చోప్రా. పారిస్‌లోనూ ఈ పర్ఫామెన్స్ రిపీట్ చేస్తే, ఇండియా బెస్ట్ అథ్లెట్‌గా కీర్తి దక్కించుకుంటాడు నీరజ్ చోప్రా.. 

2024 పారిస్ ఒలింపిక్స్‌లో 90 మీటర్ల లక్ష్యాన్ని అందుకోవడమే టార్గెట్‌గా పెట్టుకున్నాడు నీరజ్ చోప్రా. దీంతో గాయపడకుండా ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు వీలుగా శరీరంపై సాధ్యమైనంత తక్కువ ఒత్తిడి పెడుతున్నాడు నీరజ్ చోప్రా.. ఈ మధ్య కాలంలో 90 మీటర్ల దూరాన్ని అందుకున్న జావెలిన్ త్రోయర్లు తక్కువే. అయితే 1996లొ జెర్మనీ జావెలిన్ త్రోయర్ 98.48 మీటర్లు విసిరి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత 23 మంది 90 మీటర్లకు పైగా దూరాన్ని విసిరారు. పాక్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీం బెస్ట్ స్కోరు కూడా 90.18గా ఉంది.. 

 

click me!