పారా ఆసియా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం.. రెండు ఈవెంట్స్‌లో స్వీప్..

By Sumanth KanukulaFirst Published Oct 23, 2023, 9:46 AM IST
Highlights

పారా ఆసియా గేమ్స్‌లో భారత్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. చైనాలోని హౌంగ్‌జౌలో జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో రెండు ఈవెంట్స్‌లో అన్ని పతకాలను సాధించిన భారత్.. ఘనమైన ఓపెనింగ్‌ను సొంతం చేసుకుంది.

పారా ఆసియా గేమ్స్‌లో భారత్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. చైనాలోని హౌంగ్‌జౌలో జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో రెండు ఈవెంట్స్‌లో అన్ని పతకాలను సాధించిన భారత్.. ఘనమైన ఓపెనింగ్‌ను సొంతం చేసుకుంది. పురుషుల హైజంప్ టీ63, పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్‌లలో భారతదేశం మొత్తం అన్ని పతకాలను కైవసం చేసుకుంది. పురుషుల హైజంప్ టీ63 ఈవెంట్‌లో శైలేష్ కుమార్, బ్ త్రో ఎఫ్51 ఈవెంట్‌లో ప్రణవ్ సూర్మ  గోల్డ్ మెడల్స్ సాధించారు. 

పురుషుల హైజంప్ టీ63 విభాగంలో శైలేష్ కుమార్ 1.82 మీటర్లతో స్వర్ణం సాధించి.. పారా ఆసియా గేమ్స్‌లో రికార్డును నెలకొల్పారు. ఇదే గేమ్‌లో భారత్‌కే చెందిన మరియప్పన్ తంగవేలు (1.80 మీ).. రజతం, గోవింద్‌భాయ్ రాంసింగ్‌భాయ్ పధియార్ (1.78 మీ).. కాంస్యం సాధించారు. అయితే ఈ ఈవెంట్‌లో ముగ్గురు భారతీయులు మాత్రమే పోటీ పడ్డారు.

పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్‌లో.. పారా ఆసియా పారా గేమ్స్‌లో 30.01 మీటర్ల రికార్డును సృష్టించి ప్రణవ్ సూర్య స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. భారత్‌కు చెందిన ధరంబీర్ (28.76 మీ), అమిత్ కుమార్ (26.93 మీ) వరుసగా రెండు మరియు మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక, ఈ ఈవెంట్‌లో కేవలం నలుగురు పోటీదారులు మాత్రమే ఉన్నారు. ఇక, సౌదీ అరేబియాకు చెందిన రాధి అలీ అల్హర్తి 23.77 మీటర్ల త్రోతో చివరి స్థానంలో నిలిచారు.

పురుషుల షాట్‌పుట్ ఎఫ్11 ఈవెంట్‌లో మోను ఘంగాస్ 12.33 మీటర్ల ప్రయత్నంతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. మహిళల కానో వీఎల్2 ఈవెంట్‌లో ప్రాచీ యాదవ్ 1:03.147తో రజతం సాధించారు. 

click me!