తెలంగాణలో ఆషాడ బోనాల సంబరాలు షురూ!

By telugu news teamFirst Published Jun 27, 2020, 8:09 AM IST
Highlights

ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటు వ్యాధులు రాకుండా కాపాడుతారని భక్తుల విశ్వాసం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

ఆషాఢ బోనాల పండగ అంటే గ్రామదేవత అమ్మవారిని పూజించే పండుగ. భోజనం ఫ్రకృతి. బోనం వికృతి. బోనం అంటే భోజనం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. 

వేటపోతు మెడలో వేప మండలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటు వ్యాధులు రాకుండా కాపాడుతారని భక్తుల విశ్వాసం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.

భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు,పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి , ఇత్తడి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకుని డప్పుతో ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో పసుపు, కుంకుమ, బియ్యం పిండి ముగ్గుతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచడం జరుగుతుంది. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ గ్రామ దేవతా గుళ్ళను ఎంతో సుందరంగా అలంకరిస్తారు.

ఆచారాలు:- బోనాల సందర్భంగా.... పోతురాజు వేషధారి. 'ఆషాఢ' మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం, అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతోనేగాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, వంటల పండుగ వంటి పేర్లతో పిలుస్తారు. కాలక్రమేనా తర్వాత కాలంలో బోనాలుగా మారింది.

బోనాల సందర్భంగా పొట్టేళ్ళ రథంపై అమ్మవారిని  ఊరేగింపు చేస్తారు. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్ట శక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.

ఈ పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుతో  లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళను కుమ్మరిస్తారు.

తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెలను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము) సమర్పించడం ఆచారంగా వస్తూ ఉంది. బోనాల పండుగ సందోహం గోల్కొండ కోట లోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలలై లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది.

దేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి గంభీరంగా బలశాలిగా ఉంటాడు. ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు.

పోతురాజు భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు.

విందు సంబరాలు బోనాలు పండుగ దేవికి నైవేద్యము సమర్పించు పండుగ కావడం చేత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదనానంతరం మాంసాహార విందు భోజనం మొదలౌతుంది. పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్ల హోరులో పండుగ వాతావణం విస్పష్టంగా ప్రస్ఫుటమౌతుంది.

రంగం పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఆ విక్రుతమైన కొపాని తగ్గించెందుకు అక్కడవున్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు. పొతరాజు తన దంతాలతో ఆ మేక పోతును కొరికి, తల, మోండెం వేరు చేసి పైకి ఎగురవేస్తాడు (గావు పెట్టడం). ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తరువాత జరుగుతుంది.

ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయము వారి ఘటముతో ఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య అక్కన్న, మాదన్నల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపుల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది. ఈ పండగను మధ్యతరగతి వారు, శ్రామికులు వాళ్ళ కష్టాలను గట్టెక్కించమని భక్తీ శ్రద్ధలతో పూజించి బందువులు, మిత్రులతో రెండు రోజులు ఆనందంగా గడుపుతారు.  

click me!