ఒక్క ఇంజెక్షన్ చేస్తే... కావాలని అనుకున్నా పిల్లలు పుట్టరు

By telugu teamFirst Published Dec 4, 2019, 12:27 PM IST
Highlights

13 ఏళ్ల పాటు పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యానికి అడ్డుకట్ట పడుతుంది!! ఈ ఇంజెక్షన్‌ను భారత వైద్యపరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌.ఎస్.శర్మ నేతృత్వంలోని నిపుణుల బృందం అభివృద్ధిచేస్తోంది.
 

కలయిక తర్వాత పిల్లలు కలగకుండా ఉండేందుకు చాలా మంది మాత్రలు మింగడం లేదా కండోమ్ వాడటం లాంటివి చేస్తుంటారు. అయితే.. మాత్రల కారణంగా ఏవైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కండోమ్ కారణంగా భావప్రాప్తి కలగకపోవచ్చు.

అలాంటి వారికోసమే పరిశోధకులు ఓ ఇంజెక్షన్ కనిపెట్టారు. ఒకే ఒక ఇంజెక్షన్‌ చేయించుకుంటే చాలు. 13 ఏళ్ల పాటు పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యానికి అడ్డుకట్ట పడుతుంది!! ఈ ఇంజెక్షన్‌ను భారత వైద్యపరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌.ఎస్.శర్మ నేతృత్వంలోని నిపుణుల బృందం అభివృద్ధిచేస్తోంది.

 దీనికి రివర్సిబుల్‌ ఇన్‌హిబిషన్‌ ఆఫ్‌ స్పెర్మ్‌ అండర్‌ గైడెన్స్‌(ఆర్‌ఐఎస్‌యూజీ) అని పేరుపెట్టారు. పురుషుల వృషణాల నుంచి వీర్యకణాలను మూత్రనాళానికి చేరవేసే నాళికకు మత్తుమందు ఇచ్చి.. ఈ ఇంజెక్షన్‌ ఇస్తారు. ఈ ప్రక్రియ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో జరగాల్సి ఉంటుంది. 

303 మందిపై మూడు విడతలు జరిపిన ప్రయోగ పరీక్షల్లో 97.3 శాతం సానుకూల ఫలితాలు వచ్చాయని సమాచారం. ఈ ఇంజెక్షన్‌కు భారత ఔషధ నియంత్రణ మండలి ఆమోదం లభించడానికి మరో ఏడు నెలలు పట్టొచ్చు. ఇది అందుబాటులోకి వస్తే.. భారతీయులు అభివృద్ధిచేసిన, ప్రపంచంలోనే తొలి సంతాన నిరోధక ఇంజెక్షన్‌ కానుంది. 

ఈ ఇంజెక్షన్‌ అభివృద్ధిలో కీలకమైన స్టైరీన్‌ మెలీక్‌ యెన్‌హైడ్రేడ్‌ పాలిమర్‌ను 1970లోనే ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రొఫెసర్‌ సుజయ్‌కుమార్‌ గుహ కనుగొన్నారు. 1984 నుంచే ఆ పాలిమర్‌తో సంతాన నిరోధక ఇంజెక్షన్‌ అభివృద్ధిపై ఐసీఎంఆర్‌ పరిశోధనలను ప్రారంభించింది.
 

ఈ ఇంజెక్షన్‌ అభివృద్ధిపై అమెరికా కూడా దృష్టిసారించింది. ఈక్రమంలో 2016లో ఆ దేశం జరిపిన ప్రయోగ పరీక్షలు ప్రతికూల ఫలితాలు ఇచ్చాయి. ఇంజెక్షన్‌ చేయించుకున్న పురుషుల మొహంపై మొటిమలు, శరీరంపై మచ్చలు వచ్చాయి. వారి మానసిక స్థితిగతులూ ప్రతికూలంగా ప్రభావితమయ్యాయంటూ యూకేకు చెందిన నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ వెబ్‌సైట్‌ అప్పట్లో ఓ కథనాన్ని ప్రచురించింది.

click me!