బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే..

By telugu news teamFirst Published Dec 16, 2020, 3:03 PM IST
Highlights

గర్భిణులు మూడోనెల నుంచి ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఎక్కువ సేపు వెల్లకిలా పడుకోకుండా చూసుకోవాలి. పగలు సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. అయితే రాత్రి పూట వాటిని పరిమితం చేయాలి లేకపోతే ఎక్కువసార్లు మూత్రవిసర్జన నిద్రలేమికి దారి తీయును. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


గర్భము ధరించిన స్త్రీ ఏవిధముగా ఉండాలి? గర్భము ధరించిన స్త్రీ ముఖ్యముగా ఎల్లవేళలూ ప్రశాంతముగా వుండాలి. కుటుంబమందు ఆప్యాయత అనురాగము కలిగి వుండాలి. నీతి కథలను చదువుతూ వుండాలి. గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. గర్భిణులు కంటినిండా నిద్రపోవటం ఎంతో అవసరం. అయితే గర్భం ధరించినపుడు శరీరంలో జరిగే మార్పులు నిద్రలో కొన్ని సమస్యలు సృష్టిస్తుంటాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రాత్రిపూట హాయిగా నిద్రపోవటానికి వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

గర్భిణులు మూడోనెల నుంచి ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఎక్కువ సేపు వెల్లకిలా పడుకోకుండా చూసుకోవాలి.
పగలు సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. అయితే రాత్రి పూట వాటిని పరిమితం చేయాలి లేకపోతే ఎక్కువసార్లు మూత్రవిసర్జన నిద్రలేమికి దారి తీయును. కారం తక్కువగా ఉండే పదార్థాలు తినాలి. ఛాతిలో మంట పుట్టించే మసాలా ఆహారాన్ని మానెయ్యటమే మంచిది. ఛాతిలో మంట నిద్రరానివ్వదు. పడుకునేటప్పుడు గర్భిణుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దిండ్లు వాడుకోవాలి. అవి అందుబాటులో లేకపోతే మరో దిండును మోకాళ్ల మధ్య పెట్టుకొని పడుకోవచ్చు. పగటిపూట వీలు చేసుకొని కాసేపు కునుకు తీయాలి. నిద్ర బాగా పట్టేందుకు మనసును ప్రశాంతంగా ఉంచే పద్ధతులు పాటించాలి. నిద్రలేమితో బాధపడుతుంటే తప్పకుండా డాక్టరుకు చూపించుకోవటం మరవరాదు.

తీసుకోవలసిన జాగ్రత్తలు :- ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌస్టికాహారము అనగా ఎక్కువపాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు వగైరా తీసుకోవాలి . మొదటి ఆరునెలలు .... నెలకొకసారి, ఏడు -ఎనిమిది నెలల్లో నెలకు రెండు సార్లు, తొమ్మిదోనెలలో వారానికొకసారి వైద్యపరీక్షలు అవసరము . సొంతముగా మందులు వాడడము, ఎక్సరేలు తీయించుకోవడము చేయకండి . ఎత్తు మడమల చెప్పులు వాడకండి, గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. 
మొదటి మూడునెలలు, చివరి నెలలో దూరప్రయాణాలు, కారు స్కూటరు నడపడము, చేయరాదు . రాత్రులు 8-10 గంటలు, పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి . నిద్రపోవునపుడు ఒక ప్రక్కకు ( వీలైతే ఎడమ వైపు ) తిరిగి పడుకోవాలి . స్త్రీలు గర్భము దాల్చిన మూడు మాసముల తరువాత, ప్రసవించిన మూడు మాసముల వరకు యోగ విద్యనభ్యసించ రాదు. ఉదయము నడక మాత్రము చేయవలయును. ధనుర్వాతం బారినుండి రక్షణ కోసము టెటనస్ టాక్షాయిడ్ ఇంజక్షన్‌లు తీసుకోవాలి. రక్తస్రావము, ఉమ్మనీరు పోవడము, శిశువు కదలిక తగ్గినట్లు అనిపించినప్పుడు, కడుపు నొప్పి వచ్చినా డాక్టర్ని సంప్రదించాలి .

గర్భవతులకు - పోషకాహారం-- గర్భస్త సమయంలో ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు -

భారతదేశంలో, ముఖ్యంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న జనాభాలో స్త్రీ గర్భవతిగా లేని సమయంలోను, గర్భవతిగా ఉన్న సమయంలోను, ఒకే విధమైన ఆహారం తీసుకుంటున్నట్లు లెక్కల్లో తేలింది. బిడ్డకు, తల్లికి ఇద్దరికీ సరిపడా లేక ఎక్కువ ఆహారం తీసుకోవలసిన - అవసరం చాలా ఉంది.

గర్భవతి తీసుకొనే ఆహారం పుట్టబోయే బిడ్డ బరువుపై ప్రభావం చూపుతుంది. గర్భవతికి 300 cal (కాలరీల శక్తి ఎక్కువగా/అదనంగా 15గ్రా మాంసకృత్తులు/10గ్రా కొవ్వు పదార్ధాలు అయిదు/ఆరు నెలల గర్భధారణ నుండి తీసుకోవలసిన అవసరం చాలా ఉంటుంది. గర్భవతులు, బాలింతలు తీసుకొనే ఆహారంలో అధనపు కాల్షియం ఉండాలి. శిశువు ఎముకలు దంతాలు రూపు దిద్దుకోవటానికి, రొమ్ము పాలు పెరగటానికి ఇది చాలా అవసరం. గర్భస్ధ దశలో ఇనుము లోపంతో వచ్చే రక్తహీనత కాన్పు సమయంలో తల్లి మరణానికి దారి తీస్తుంది. శిశువు తక్కువ బరువుతో పుడతారు కనుక ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవలసి ఉంటుంది.

చాగంటి వారి మాటల్లో .. గర్భిణీ స్త్రీ రెండవ నెలంతా ఆవునేతితో బాగా కలిపి ముద్ద చేసిన పప్పన్నం తినాలి - వేవిళ్ళ కారణంగా నేయి తినడానికి గర్భిణి ఇష్టపడని పక్షంలో పప్పునూనెతో కలిపిన పులిహోరని రోజుకి ఒక ముద్ద చొప్పున మాత్రమే అమ్మకి నైవేద్యం పెట్టి తినాలి నెలంతా.

లోకంలో కొందరు 'తాము చేయరు - చేస్తున్న వాళ్ళని మాన్పించే వరకూ ఊరుకోరు'.. అలాంటి వాళ్ళు తారసపడి - 'అమ్మకి నైవేద్యమంటే సామాన్యమా..? మడితో పెట్టాలి. ఈ నియమాలు ఆ నియమాలంటూ భయపెడితే 'ఎవరూ భయపడద్దు.

అమ్మ అనేక కోటి బ్రహ్మాండ జనని ( అనేక కోట్ల జీవరాసులకి జన్మనిచ్చిన తల్లి ) అంతే కాక, అవ్యాజ కరుణామూర్తి ( ఏ వంకా లేని కరుణతో అలా రూపుగట్టి నిల్చిన ఇల్లాలు )  స్నానం చేసి, ఉతికిన వస్త్రాన్ని కట్టుకుని కేవల లలితా సహస్రనామాలు చదివి నైవేద్యం పెడితే చాలు. సంతోషించే లక్షణం కలది ఆమె. కాబట్టి ఎవరి మాటల్నో విని గర్భిణులు భయపడొద్దు - మానివేయద్దు. 

ఏ గర్భిణి ఈ రోజు నుండి తొమ్మిది నెలల పాటు లలితా నామాలని చదవడానికి సిద్ధపడిందో ఆ రోజున మాత్రం పూర్వపీఠికతో పాటు లలితా సహస్రనామాలూ చదివి,  ఇక అక్కడి నుండి తొమ్మిది మాసాల పాటు సహస్రనామాలు చదువుతూ బాలసారె నాడు లలితా సహస్రనామాలు, ఉత్తర పీఠిక కూడా చదివి ముగించాలి.

రెండవ నెల మొత్తం ఈ క్రింది శ్లోకాలని అవకాశమున్నన్ని ఎక్కువమార్లు చదువు కోవాలి.

'అనాహతాబ్జ నిలయా శ్యామాభా వదనద్వయా.. 
దంష్ట్రోజ్జ్వలాక్షమాలాదిధరా రుధిర సంస్థితా!

కాలరాత్ర్యాది శక్త్యౌఘవృతా స్నిగ్ధౌదనప్రియా.. 
మహావీరేంద్ర వదనా రాకిన్యంబా స్వరూపిణీ!!

రెండవ నెలలో శిశువుకి శిరస్సు ఏర్పడడమే కాక రక్తం చేరుతుంది. కాబట్టి ( మాసద్వయేన శిరః కురుతే ) రక్తదోషం రాకుండానూ సరైన శిరస్సు శిశువుకి లభించేందుకూ పై శ్లోకాన్ని చదువుతూండాలి. ఈ నెల మొత్తం శిశువుని రక్షించే తల్లి పేరు 'రాకినీ దేవి'. అని చాగంటి వారి ప్రవచనాలలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. పెద్దలు చెప్పిన మాటలను శ్రద్ధతో ఆచరిస్తే మేలే జరుగుతుంది.

click me!