ఇసుక కొరత: పవన్ కల్యాణ్ పై ఎదురుదాడి, వాస్తవాలు ఇవీ...

By telugu teamFirst Published Nov 5, 2019, 6:05 PM IST
Highlights

ఇసుక కొరతపై పవన్ కళ్యాణ్ ఆదివారం రోజు లాంగ్ మార్చ్ నిర్వహించగానే అధికార వైసీపీ నేతలంతా పవన్ ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. చంద్రబాబు బి టీం అని అంటున్నారు. ఇసుక కొరతకు ప్రకృతి వైపరీత్యాలు కారణమంటూ ప్రభుత్వం బుకాయిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఇసుక లెక్కలపై వాస్తవాలేంటో చూద్దాం. 

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం రోజు విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక కొరతను నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలుస్తూ వారికి సంగీభావం తెలపడానికి ఈ లాంగ్ మార్చ్ చేపట్టాడు పవన్. 

లాంగ్ మార్చ్ పూర్తి అయిన దగ్గర్నుంచి వైసిపి నేతలంతా ఒకరి తర్వాత ఒకరుగా ప్రెస్ మీట్లు పెట్టి మరి పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడుతున్నారు. ఒకరేమో విశాఖపట్నంలో నది ప్రవహిస్తుందా? ఇక్కడేదన్న నది ఉందా అంటే అవహేళనగా మాట్లాడారు. 

Also read: మ్యాప్‌లో అమరావతి గల్లంతు: చంద్రబాబు సరే, ఆరు నెలల జగన్ వైఖరి వల్లనే సందేహాలు

విశాఖపట్నంలో నది లేదు కాబట్టి విశాఖపట్నంలో ఈ లాంగ్ మార్చ్ నిర్వహించకూడదని లేదు కదా! విశాఖపట్నంలో నది ప్రవహించట్లేదు కదా అని విశాఖపట్నంలో ఇసుకను వాడడం మానేశారు? భవన నిర్మాణాలు జరగడం లేదా? 

అసలు వాస్తవంగా రాష్ట్రంలో ఇసుక పరిస్థితి ఏంటి? ఎందుకు ఇంతలా  ఇసుక కోసం పోరాటం చేయవలసి వస్తుంది? దీనికి కారణాలు ఏంటి తెలుసుకుందాం... 

మొదటగా ప్రభుత్వం చెబుతున్న వాదన ఏంటంటే ప్రకృతి వైపరీత్యమైన వరదల వల్ల ఇసుక దొరకడం లేదు అని అంటుంది.  అవును ఇది ఒకింత వాస్తవం కూడా. కానీ ఈ ఇసుక కొరతకు ప్రకృతి వైపరిత్యాల కన్నా, ప్రభుత్వ విధానాలే కారణమని సమస్యను పూర్తిగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. 

Also read: టికెట్ లేని సినిమా చూపించావ్, చెడగొడుతున్నావ్: పవన్ పై అవంతి తీవ్ర వ్యాఖ్యలు

చంద్రబాబు సర్కారును గద్దె దించిన అతి ముఖ్యమైన కారణాల్లో ఇసుక మాఫియా ఒకటి. బినామీల పేరుతో ఇసుక,గ్రానైట్ వంటి ప్రకృతి వనరులను భోంచేశారని వైసీపీ అప్పట్లో ఆరోపించింది. ఇసుక,గ్రానైట్ సహా టీడీపీ పెద్దల అవినీతికి ఆంధ్రప్రదేశ్ దోపిడీకి గురయ్యిందని ఆరోపించింది. 

దీనితో అధికారంలోకి రాగానే టీడీపీ నేతల కబంధ హస్తాల నుండి బందీ అయిన ప్రకృతి  వనరులను  కాపాడటం పేరిట ఆంధ్రప్రదేశ్ లో ఇసుక-మైనింగ్ తవ్వకాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. టీడీపీ నేతల అక్రమాలకు, అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేశామని తొలుత చెప్పుకున్నప్పటికీ,ఇప్పుడు ఇసుక కొరత నూతన తలనొప్పులు తెచ్చిపెడుతుంది జగన్ సర్కార్ కు. అంతేకాకుండా ఈ ఇసుక కొరత ఇప్పుడు ప్రతిపక్షాలకు ఒక నూతన అస్త్రంగా మారింది.  

Also read: వంగోబెట్టారు, పడుకోబెట్టారు తాట కూడా తీశారు : పవన్ కు అంబటి కౌంటర్

ఈ ఇసుక కొరత వల్ల ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన సంక్షోభం ఏర్పడి ఉంది. భవన నిర్మాణ రంగం కుదేలయింది. నిర్మాణ రంగంతోపాటు ఇంకో 20 అనుబంధ రంగాలు కూడా ఈ ఇసుక కొరత వల్ల దెబ్బతిన్నాయి. 

స్టీల్ సిమెంట్ అమ్మకాలు పడిపోయాయి. ఈ రవాణపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు పని దొరక్క నాలుగు నెలలవుతుంది. ఈ నిర్మాణ రంగంపై ఆధారపడ్డ మేస్త్రీలు,కార్మికులు ఉపాధి కరువై ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. వలస వెళ్లలేకపోయినవాళ్లు ఇతర రంగాల్లో ఉపాధిని వెతుక్కుంటున్నారు. 

జగన్ ప్రభుత్వం ఇసుక తవ్వకాలపై ఒక విధానం తీసుకురావడానికి చాల సమయం పట్టింది. మేలో ప్రమాణస్వీకారం చేసిన జగన్ సర్కార్ మూడు నెలలపాటు ఇసుక తవ్వకాలను ఆపేసింది. ఇసుకవిధానాన్ని నాలుగు నెలల తరువాత సెప్టెంబర్ మొదటివారంలో తీసుకువచ్చింది. 

Also read: హద్దు మీరితే తాట తీస్తా.. కన్నబాబు, విజయసాయిలకు పవన్ వార్నింగ్

సెప్టెంబర్ మొదటి వారంలో ప్రభుత్వమే ఇసుక అమ్ముతుందని జీవో జారీ చేశారు. దాని తర్వాత ఇసుక రేట్లను అమాంతం పెంచేశారు. ఇసుక ఆన్ లైన్  టెండరింగ్ పేరిట అమ్మబోతున్నామని  ప్రభుత్వం తెలిపింది. ఈ ఆన్ లైన్ టెండరింగ్ ప్రక్రియలోకి దళారులు ప్రవేశించారు. 

స్లాట్ బుకింగ్ ల పేరిట దళారులు స్వయంగా వారే ఇసుకను కొల్లగొట్టడం ఆరంభించారు. అలా ఇసుకను దక్కించుకున్న తరువాత అధిక రేట్లకు ఇతరులకు విక్రయించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఇసుక అక్రమ మైనింగ్ కూడా చాలాచోట్ల యథేచ్ఛగా కొనసాగుతోంది. 

ఇసుక రవాణా వ్యయం కూడా తడిసి మోపెడు అవుతుంది. ఇసుక కొరత వల్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవం భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు పనులు దొరక్క  పస్తులు ఉంటున్నారు.  

వారికి పూట గడవడం కూడా చాలా కష్టంగా మారింది. పిల్లల చదువులు సాగడం లేదు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి.  ఫలితంగా కొందరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 

ఇప్పటికే అమరావతి పైన, పోలవరం పైన ఒక సందిగ్ధ వాతావరణం ఏర్పడింది.  నిర్మాణ రంగం ఇప్పటికే కుదేలైంది. ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ రంగం నుండి,నిర్మాణ పర్మిషన్ ల నుండి భారీ స్థాయిలోనే డబ్బులు వస్తాయి. ప్రస్తుతం దేశమంతటా ఆర్ధిక మాంద్యం తాండవం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనికి అతీతం కాదు. 

ఇప్పుడు ఇలా ఇసుక అందుబాటులో లేకపోవడంతో ఆల్రెడీ దెబ్బతిన్న రియల్ ఎస్టేట్ రంగం మరింత దెబ్బతిన్నది. ఇలా ఈ ఇసుక కొరత వల్ల చాల మంది ఉపాధి కోల్పోతున్నారని , రాష్ట్ర నిర్మాణ రంగం దెబ్బతిన్నది,దీనిప్రభావం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై పడింది, ఎందరో కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. 

ప్రజల్లో ఉన్న ఈ అసంతృప్తిని పట్టించుకోకుండా బుకాయించడం ఎంతవరకు సబబు? పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి పనిని పొలిటికల్ యాంగిల్లో చూడడం అంత మంచిది  కాదు.  పవన్ కళ్యాణ్ ఏ ప్రజా సమస్యపైనైనా పోరాటం చేయడం మొదలు పెట్టగానే చంద్రబాబు నాయుడు బీ టీం అంటూ అతని పైన విమర్శలు చేస్తున్నారు.  

ప్రశ్నకు ప్రశ్న సమాధానం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు వైకాపా నేతలు. ఇసుక కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, చంద్రబాబు హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలు మీకు కనబడలేదా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.  

సమస్యను ఎత్తిచూపడం ప్రతిపక్షాలు చేయాల్సిన పని, తద్వారా ప్రజలకు మేలు కలుగుతుంది ఇదే భారతీయ ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. ఇక్కడ పవన్ కళ్యాణ్ అడుగుతున్న ప్రజా సమస్యలకు సమాధానం చెప్పాలి కానీ పవన్ ని ఎదురు ప్రశ్నిస్తే ఇసుక కొరత లేదని బుకాయిస్తే ఉన్న ఇసుక కొరత తీరుతుందా?

click me!