కేసీఆర్ తో కటీఫ్: అమిత్ షా గురి తెలంగాణపైనే, వ్యూహం ఇదే...

By telugu teamFirst Published Dec 14, 2019, 1:24 PM IST
Highlights

కర్ణాటక తరువాత దక్షిణ భారతంలో తమకు ఆస్కారం ఉంది అని బీజేపీ భావిస్తున్న మరో రాష్ట్రం తెలంగాణ. అందుకోసం బీజేపీ ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. ఇక్కడ ఎంఐఎం తో కేసీఆర్ జుగల్బందీ కారణంగా హిందుత్వ కార్డును ఉపయోగించి లాభపడొచ్చని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జెండాను ఎగరేయాలని రకరకాల సమాలోచనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర భారతదేశంపై గట్టి పట్టునే సాధించినప్పటికీ, దక్షిణ భారతదేశం మాత్రం బీజేపీకి కొరకరాని కొయ్యగా తయారయ్యింది. కర్ణాటక మినహా దక్షిణాదిన బీజేపీకి ఎక్కడా పట్టు చిక్కడంలేదు. 

కర్ణాటక తరువాత దక్షిణ భారతంలో తమకు ఆస్కారం ఉంది అని బీజేపీ భావిస్తున్న మరో రాష్ట్రం తెలంగాణ. అందుకోసం బీజేపీ ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. ఇక్కడ ఎంఐఎం తో కేసీఆర్ జుగల్బందీ కారణంగా హిందుత్వ కార్డును ఉపయోగించి లాభపడొచ్చని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. 

ఎప్పుడైతే పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలు సాధించిందో... అప్పటినుంచి కేసీఆర్ తో ఉన్న అప్రకటిత మైత్రికి ఒకింత ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా మనకు కనపడుతుంది. కేసీఆర్ కూడా ఈ పొంచి ఉన్న ప్రమాదాన్ని అర్థం చేసుకొనే పౌరసత్వ బిల్లును వ్యతిరేకించారని వార్తలు వినిపిస్తున్నాయి. 

Also read: కేసీఆర్ ఆదేశాలు బేఖాతరు: ఆర్టీసీ కార్మికులపై అశ్వత్థామ రెడ్డి

నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలిచి ఊపు మీదున్న కమలదళం రాష్ట్రం లో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ను దెబ్బతీయడానికి ప్రణాళికలు రచిస్తోంది. పార్టీలోకి భారీగా చేరికలు చేపట్టిన ఆ పార్టీ కొంతమేర పుంజుకుంది.

  మరోవైపు ఏ చిన్న ప్రజా సమస్యపై అయినా సరే, ఆందోళనకు దిగుతూ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు బీజేపీ నాయకులు.  ఏ చిన్న అంశాన్నీ వదలకుండా తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ. 

బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా పార్టీని బలోపేతం చేసేందుకు ఇక ఇప్పుడు ఆ పార్టీ దృష్టి బీసీలపై పడింది. తెలంగాణ జనాభాలో ఎక్కువగా ఉన్న బీసీ ఓటర్లను తమవైపు తిప్పుకోవడం ద్వారా రాష్ట్రంలో మరింత బలపడవచ్చని భావిస్తోంది కాషాయ పార్టీ.

బీసీ ఓటర్ల మద్దతు ఉన్న టీడీపీ తెలంగాణ లో బలహీన పడటంతో ఆ స్థానాన్ని ఎలాగైనా భర్తీ చేయాలని చూస్తోంది బీజేపీ. టి టీడీపీ సగానికిపైగా ఖాళీ అయ్యింది. మిగతా నాయకులు సైతం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 

అలా టీడీపీ లీడర్లను తెచ్చుకుంటే కేడర్ కూడాతమ వైపు వస్తే...  బీసీ ఓటింగ్ తమకు పెరుగుతుందని బీజేపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్  తనయుడు ఆశిష్ గౌడ్ తో పాటు పలువురు బీసీ నాయకులను పార్టీలో చేర్చుకోవడం ఈ వ్యూహంలో భాగమేనని  పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also read: టీఆర్ఎస్ ధైర్యమిదే: బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవా?

బీసీ వర్గానికే చెందిన ప్రధాని మోడీ ఇప్పటికే జాతీయ స్థాయిలో బీసీలకు పెద్దపీట వేస్తున్నారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.  ఇక తెలంగాణాలో కూడా బీసీ వర్గానికే చెందిన లక్ష్మణ్ కొనసాగుతున్నారు.  

కొంత కాలంగా తెలంగాణాలో బీజేపీ నాయకత్వ మార్పుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ ను పక్కకుపెట్టి వేరే ఒకరికి ఛాన్స్ ఇస్తారనే ఊహాగానాలు బయల్దేరాయి. డీకే అరుణకు పగ్గాలను అప్పగిస్తారని జోరుగా ప్రచారం సాగుతుంది.   

ఇప్పుడు ఈ బీసీ చర్చ నేపథ్యంలో లక్ష్మణ్ నే అధ్యక్షుడిగా కొనసాగిస్తారని వాదన కూడా తెరపైకి వచ్చింది. మరో వైపు అధికార పార్టీ తో పాటు ఇతర పార్టీలకు చెందిన పలు బీసీ నాయకులు పార్టీలో చేరే అవకాశం ఉందని బీజేపీ లీడర్లు చెప్తున్నారు. ఇక 2023లో బీసీనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదని పార్టీలోని కొందరు సీనియర్లు  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

click me!