ముద్రగడ కొత్త ఎత్తుగడ ఏమిటి?

First Published Aug 29, 2017, 10:53 AM IST
Highlights
  • కొత్త ఎత్తుగడ కోసం ముద్రగడ మంతనాలు
  • ముఖ్యమంత్రి బాబు ఎత్తుగడలకు చిత్తవుతారా లేెక
  • ఆయన్ని చిత్తు చేస్తారా
  • పాదయాత్ర తాత్కాలిక విరమణ
  • బుధవారం నాడు రాష్ట్ర కాపు పెద్దలతో సమావేశం

కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు కొత్త ఎత్తుగడ ఏదో వేయబోతున్నారు. కిర్లంపూడిని పోలీసు శిబిరంగా మార్చి, ఆంక్షలు విధించి, ఆయన పాదయాత్ర చేపట్టకుండా చేయడంలో ప్రభుత్వం సఫలమయింది. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని విరమిస్తే కాపు గోడు ఇక వినే వాళ్లే ఉండరు. ఎందుకంటే, రిజర్వేషన్లు అవసరం లేదని కూడా ముఖ్యమంత్రి కొంతమంది కాపులతో చెప్పించారు. ఈ దశలో నిర్బంధానికి తలొగ్గి ఉద్యమం మానేస్తే కాపుల అత్మగౌరవానికి తీరని హాని జరుగుతుందని ఆయన భావిస్తున్నారు. ఈ కొత్త ఎత్తుడ కోసం ఆయన కిర్లంపూడి-అమరావతి పాదయాత్ర ప్రయత్నాలను విరమించుకున్నారు.  ఆగస్టు మూడన ఆయనపాదయాత్ర మొదలు పెట్టాల్సి ఉండింది.  పోలీసులు కట్డడిచేశారు.

అప్పటినుంచి ఆయన  పాదయాత్రకు చేపట్టేందుకు ప్రతిరోజూ ప్రయత్నిస్తున్నారు.  అయితే,పోలీసులు ఈ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు. ఆయన గృహనిర్బంధం పేర కిర్లంపూడిలోని ఇంటికే పరిమితం చేశారు.  దీనితో ఇపుడు ఆయన ఈ ప్రయత్నాలను విరమించుకుని ప్రత్యామ్నాయ వ్యూహం రచించేందుకు పూనుకుంటున్నారు. దీనికోసం రాష్ట్రంలోని 13 జిల్లాలో ఉన్న కాపు నాయకులతో సమాచాలోచనలు సాగించేందుకు తన పాదయాత్ర ప్రయత్నాలను విరమించారు.

ఆగస్టు 30న అన్ని జిల్లాల కాపు జెఎసి నేతలతో సమావేశమవుతున్నారు. ఆయనను కలుసుకునేందుకు ‘చలో కిర్లంపూడి’ పేరుతో వేల సంఖ్యలో తరలివస్తున్నారు. ఆదివారం ఆయన వేలాదిమందితో సుమారు మూడు కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేశారు. ముద్రగడకు పాదయాత్ర చేసే ఉద్దేశమే లేదని, గేటు దాటి కూడా వెళ్లలేకపోతున్నారని ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు,మరొక పక్క ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆయన్ని హేళనచేశారు. దీనికి సమాధానంగానే , కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వచ్చిన సందర్భంగా  ముద్రగడ పోలీసు వలయాన్ని ఛేదించి పాదయాత్రను ప్రారంభించారు.  దీనితో కిర్లంపూడి, రామవరం తదితర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

రాయవరం కూడలి నుంచి కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు పోలీసులు వాహనం ఎక్కించేటప్పుడు జిల్లా ఎస్‌పి విశాల్‌ గున్ని ఆయన పక్కన కూర్చునేందుకు ప్రయత్నించారు. ముద్రగడ వద్దని వారించారు. 'నేను ఉగ్రవాదిని, నా దగ్గర కూర్చోవద్దంటూ' ముద్రగడ చెప్పడంతో ఎస్‌పి ఇబ్బంది పడ్డారు.ఆయనను కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు, తిరిగి రాత్రి కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఆ తర్వాత ఆయన్ను తన స్వగృహానికి చేర్చే వరకూ పోలీసులు నానాపాట్లు పడ్డ సంగతి తెలిసిందే.

ముద్రగడ తన ఉద్యమ ాన్ని ఎలా ముందుకు తీసుకెళతారో చూడాలనే ఆసక్తి కాపులందరిలో నెలకొని ఉంది.ముఖ్యమంత్రి ఎత్తుగడలకు చిత్తవుతారా లేక బాబు ఎత్తుగడలను చిత్తు చేస్తారా చూడాలి.

click me!