NEWS
కొద్ది రోజుల క్రితం విజయవాడ బీసెంట్ రోడ్డులో జరిగిన బంగారం దోపిడీ కేసును పోలీసులు చేధించారు. పోలీసులు 16 బృందాలుగా ఏర్పడి దోపిడీ దొంగలను పట్టుకోగలిగినారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను విజయవాడ పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ ఈరోజు తెలియజేశారు. ఈ కేసును తాము సవాలుగా తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దొంగతం జరిందన్న విషయం తెలియగానే తామంతా అప్రమత్తమైనట్లు తెలిపారు. ముంబయి, బెంగళూరు, కలకత్తా, చెన్నై, పూనెలలో గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
ఈ దొంగతనానికి పాల్పడిన దోపిడీ దొంగలందరికీ గతంలో నేర చరిత్ర ఉందని ఆయన అన్నారు. బంగారు దుకాణంలో పనిచేసే మానేసిమ అనే వ్యక్తే ఈ ఘటనకు అసలు సూత్రధారి అని తెలిపారు. ఈనెల 10వ తేదీనే దొంగతం చేయడానికి ప్రణాళిక చేశారని.. కానీ కుదరక తర్వాత ప్రయత్నించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. టెక్నాలజీని ఉపయోగించి ఈ కేసును చేధించామని.. సీఎం చంద్రబాబు కూడా ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతిరోజు పూర్తి వివరాలు తీసుకున్నట్లు కమిషనర్ చెప్పారు. దోపిడీకి పాల్పడిన ఏడుగురు నిందితులను పట్టుకున్నామని.. వారి వద్ద నుంచి 4.25కేజీల బంగారం, ఒక రివాల్వర్,5 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.