NEWS
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పులు గుర్తు తెలియని వ్యక్తులు కొట్టేశారు. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. శుక్రవారం వెంకయ్యనాయుడు బెంగళూరు పర్యటనకు వెళ్లారు. బీజేపీ ఎంపీ పీసీ మోహన్ ఆయనను అల్పాహారం స్వీకరించేందుకు వారింటికి ఆహ్వానించారు. ఎంపీ ఆహ్వానం మేర అక్కడికి వెళ్లిన వెంకయ్యను కలిసేందుకు అభిమానులు, పార్టీ నేతలు క్యూలు కట్టారు. వారందరితోనూ వెంకయ్య సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం బయటకు వచ్చి చూడగా.. ఆయన చెప్పులు కనపడలేదు. దీంతో.. ఆయన కాళ్లకు చెప్పులు లేకుండానే వెళ్లాల్సి వచ్చింది. భారీ సంఖ్యలో జనం గుమిగూడిన నేపథ్యంలో ఇతరనేతలు ఎవరన్నా వెంకయ్య పాదరక్షలు పొరపాటున వేసుకుని ఉంటారని భద్రతాసిబ్బంది భావించారు. ఆ సమయంలో వెంకయ్యనాయుడు వెంట కేంద్రమంత్రి సదానందగౌడ, బీజేపీ ఎమ్మెల్యేలు రవి, జగదీశ్ శెట్టర్ తదితరులు ఉన్నారు