
ఉత్తర ప్రదేశ్ రైలు ప్రమాద ఘటనకు గల కారణాలను సాయంత్రంలోగా తెలియజేయాలని రైల్వే బోర్డు ఛైర్మన్ ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆదేశించారు.
ఈ శనివారం ఖతౌలీ వద్ద పూరీ-హరిద్వార్ కళింగ ఉత్కళ్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురి కావడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం నాటికి ప్రమాద స్థలి వద్ద చేపట్టిన సహాయక చర్యలను నిలిపివేశారు. దాదాపు 156 మంది గాయపడినట్లు యూపీ అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిలో డజను మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
కాగా ఈ ఘటనపై సురేష్ ప్రభు స్పందించారు. ప్రమాదానికి గల కారణాలను ఈరోజు సాయంత్రం కల్లా తెలియజేయాలని ఆదేశించారు. ఏదైనా లోపాల వల్ల ప్రమాదం జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన అధికారులను హెచ్చరించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా ఆయన ఆదేశించారు.