NEWS
యోగి క్షేమంగానే ఉన్నారన్న అధికారులు
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. ఆయన ప్రయాణిస్తున్న చాపర్ను అత్యవసరంగా కాస్గంజ్లోని పొలాల్లో దింపేయాల్సి వచ్చింది. అయితే యోగి క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్ను కాస్గంజ్లోని కస్తూర్బా గాంధీ విద్యాలయ పాఠశాలలో దింపేందుకు హెలిప్యాడ్ ఏర్పాటు చేయగా హెలికాప్టర్లో ఏర్పడిన సమస్య కారణంగా అత్యవసరంగా కిలోమీటరు దూరంలోనే పొలాల ప్రాంతంలో దింపేశారు. ముఖ్యమంత్రి క్షేమంగా ఉన్నారని, ఆయన పాల్గొనాల్సిన కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొన్నారని హోం శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ లఖ్నవూలో వెల్లడించారు.
కాస్గంజ్ జిల్లాలోని ఫరౌలి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన ముగ్గురు వ్యక్తుల కుటుంబ సభ్యులను కలిసేందుకు యోగి ఈరోజు ఉదయం అక్కడికి వెళ్లారు. ప్రయాణ సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కానీ యోగి తన పర్యటనను యథావిధిగా కొనసాగించారు. వారిని కలవడమే కాకుండా జిల్లా కలెక్టరేట్లో శాంతి భద్రతల అంశంపై సమీక్ష నిర్వహించారు. అలాగే కొందరు లబ్ధిదారులకు సీఎం చెక్కులను అందించారని, అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేశారని జిల్లా ఎస్పీ పీయూష్ శ్రీవాత్సవ వెల్లడించారు.