
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పోలీసులను కించపరుస్తూ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇప్పటికే ఆయన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ధీటుగా స్పందించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దిగ్విజయ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఇక డీజీపీ అనురాగ్ శర్మ కూడా తెలంగాణ పోలీసుల ఆత్మస్థైర్యాన్ని తగ్గించేలా దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు రాష్ట్ర హోం మంత్రి నాయని కూడా డిగ్గీ వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు.
తెలంగాణ పోలీస్ లపై దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు దురదృష్ట కరం. ఆయన ఆరోపణలు రుజువు చెయ్యాలి. లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని నాయిని డిమాండ్ చేశారు.
ఇప్పటికే ఈ విషయమై తమ శాసనసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. సమర్థవంతంగా పనిచేస్తున్న రాష్ట్ర పోలీసులపై దిగ్విజయ్ సింగ్ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
అయితే తన వ్యాఖ్యలపై మాత్రం దిగ్విజయ్ సింగ్ వెనక్కి తగ్గడం లేదు. ఎలాంటి కేసులు పెట్టినా అభ్యంతరం లేదని తెలంగాణ పోలీసులకు సవాలు విసిరారు. న్యాయపోరాటానికైనా తాను సిద్దమేనని స్పష్టం చేశారు.