
అగ్రరాజ్యం అమెరికాలోని ఓ కీలక పదవికి భారత సంతతికి చెందిన మహిళను కేటాయించనున్నరా.. అవుననే అంటున్నారు వైట్ హౌజ్ వర్గాలు. ఓ ఇండియన్- అమెరికన్ మహిళను తమ స్టేట్ డిపార్ట్ మెంట్ లో కీలక పదవికి నామినేట్ చేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారట. అంతేకాదు.. స్టేట్ ఆర్థిక సంబంధిత విషయాలకు కూడా ఆ మహిళను ఇంఛార్జ్ చేయాలని కూడా ట్రంప్ అనుకుంటున్నారట.ఈ విషయాన్ని అధికారికంగా వైట్ హౌస్ అధికారులు చెప్పారు.
గతంలో ఈ బాధ్యతలను చార్లెస్ రివికన్ నిర్వహించే వారు. ట్రంప్.. 45వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే.. చార్లెస్ రివికన్.. తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. దీంతో.. దీనిని ఇండియన్-అమెరికన్ మహిళ మనీషా సింగ్ కు అప్పగిస్తే బాగుంటుందని ట్రంప్ భావిస్తున్నారట.
మనీషా సింగ్(45).. ప్రస్తుతం స్టేట్ ఎకనామిక్ బ్యూరో కి డిప్యుటీ అసిస్టెంట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ఆమెకు కీలక పదవిని అప్పగించనున్నారు. మనీషా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. ఆమె చిన్నతనంలోలనే తన తల్లిదండ్రులతో కలసి ఫ్లోరిడా కి వచ్చి స్థిరపడ్డారు.