బుగ్గ చరిచాడు.. సారీ చెప్పాడు

First Published Apr 18, 2018, 2:55 PM IST
Highlights

మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన గవర్నర్

తమిళనాడు గవర్నర్ భ‌న్వ‌రిలాల్‌ పురోహిత్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మహిళా పాత్రికేయురాలు లక్ష్మీ సుబ్రమణియన్‌తో ఆయన అనుచితంగా ప్రవర్తించారు. ద వీక్ పత్రిక జర్నలిస్టు లక్ష్మీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేస్తూ ఆమె చెంపను తట్టడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గవర్నర్ పురోహిత్ ప్రవర్తన సరిగా లేదని ఆరోపణలు వస్తున్నాయి. తమిళనాడులో ఇటీవల సంచలనం రేపిన ప్రొఫెసర్ నిర్మలా దేవి అంశంపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

అనేక ప్రశ్నలకు ఆ కాన్ఫరెన్స్‌లో గవర్నర్ సమాధానం ఇచ్చారు. ప్రొఫెసర్ నిర్మలాదేవి ఓ కాలేజీకి చెందిన నలుగురు అమ్మాయిలను సెక్స్‌వర్క్‌లుగా మార్చేందుకు ప్రయత్నించింది. ఆ అంశం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెను చర్చకు దారి తీసింది. ఆ వివాదాస్పద ప్రొఫెసర్‌కు గవర్నర్ పురోహిత్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. తనపై వచ్చిన ఆరోపణలను గవర్నర్ కొట్టిపారేశారు. చాలా ఆగ్రహంగా ఆయన సమాధానాలు ఇచ్చారు. ఇక ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసే సమయంలో జర్నలిస్టు లక్ష్మీ ఓ ప్రశ్న వేసింది. ప్రభుత్వ పర్ఫార్మెన్స్‌తో సంతృప్తికరంగా ఉన్నట్లు మీరు తెలిపారు కాదా, మరి రాష్ట్రంలోని వర్సిటీల పనితీరు బాగుందని మీరు భావిస్తున్నారా అని ఆమె అడిగారు. ఆ సమయంలో కూర్చీలోంచి లేచిపోతూ.. గవర్నర్ పురోహిత్ ఆ జర్నలిస్టు బుగ్గను తట్టారు. అంతే.. గవర్నర్ అనుచిత ప్రవర్తన వివాదాస్పదమైంది.

ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గవర్నర్ వెంటనే క్షమాపణలు తెలిపారు. మనువరాలి వయస్సులో ఉన్న ఆమెను అభినందించేందుకే ఆమె చెంపను తాకానన్నారు. తన చర్య వల్ల ఆ మహిళా జర్నలిస్టు బాధపడినందు వల్ల ఆమెకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. దయచేసి తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని  గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ కోరారు.

click me!