
తిరుపతి-జమ్ము తావి హంసఫర్ వారాంతపు ఎక్స్ప్రెస్ (22705)ను విజయవాడలో జెండా వూపి ప్రారంభిస్తారు. రిమోట్ కంట్రోల్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
తిరుపతి నుంచి నేరుగా జమ్మూకు ఈ నూతన రైలును ప్రవేశపెడుతున్నారు.ఈ పదిగంటలకు ఈ కార్యక్రమం ఉంది. దీనితో పాటు పది ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కూడా నేడు ప్రారంభోత్సవం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రమంత్రులు సురేష్ ప్రభు, ఎం.వెంకయ్యనాయుడు, పి.అశోక్గజపతి రాజు, సుజనాచౌదరి ఈ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. గుంతకల్ - వాడి స్టేషన్ల మధ్య రైల్వే డబిలింగ్, విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ఈ లైనునుకూడా రిమోట్ కంట్రోల్ ద్వారా నేడు జాతికి అంకితం చేస్తారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రాజక్టులు ప్రారంభమవుతాయి. కొత్త రైళ్లు, నూతన లైన్లు, విద్యుదీకరణ, శిక్షణ కేంద్రం, లోకో షెడ్డు వంటివి వీటిలో ఉన్నాయి. రాజధాని వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విజయవాడ-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ సర్వీసు కూడా ఈ ఈ రోజు మొదలవుతుంది. డ్రైవర్లకు అధునాతన శిక్షణ కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం ఈ రోజే మొదలవుతుంది.
విజయవాడ-హౌరా రైలు నూతన రాజధానివాసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ విజయవాడ మీదుగా హౌరా వెళ్లే రైళ్లన్నీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్తున్నవే. తొలిసారి ఇక్కడి నుంచి హౌరాకు సూపర్ ఫాస్టు ఎక్స్ ప్రెస్ వారానికోసారి ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ-హౌరా హంసఫర్ ఎక్స్ప్రెస్ పేరుతో ఈ సర్వీసును నడస్తుంది.
ఇక ప్రారంభమవుతన్న హం సఫర్ ఎక్స్ ప్రెస్ ( నంబర్ 00890) మధ్యాహ్నం 12.30కు విజయవాడలో బయలుదేరుతుంది. సాయంత్రం 3గంటలకు రాజమండ్రి, 6.45కు విశాఖపట్నం, రాత్రి 8.05కు విజయనగరం, రాత్రి 1.40కు భువనేశ్వర్, 2.15కు కటక్, ఉదయం 6.25కు ఖరగ్పూర్, ఉదయం 8.15కు హౌరా చేరుతుంది. వారానికోసారి నడిచే ఈ రైలులో 19 బోగీలు ఉంటాయి. వీటిలో 16 ఏసీ త్రీ టైర్, ఒక ప్యాంట్రీ కార్, రెండు జనరేటర్ పవర్ కార్ కోచ్లు ఉంటాయి. ఈ ఒక్కరోజు మాత్రం బుధవారం బయలుదేరి వెళుతుంది. వచ్చేవారం నుంచి మాత్రం విజయవాడ-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 20890 ప్రతి ఆదివారం రాత్రి 11.05కు ఇక్కడ బయలుదేరుతుంది. సోమవారం సాయంత్రం 6.30కు హౌరాకు చేరుతుంది. తిరిగి హౌరా-విజయవాడ ఎక్స్ప్రెస్ 20889 మాత్రం అక్కడ ప్రతి శనివారం మధ్యాహ్నం 12.40కు బయలుదేరి ఆదివారం ఉదయం 7.45కు విజయవాడకు వస్తుంది. మధ్యలో.. రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, భువనేశ్వర్, కటక్, ఖరగ్పూర్లో ఆగుతుంది.
కడప-పెండ్లిమర్రి డీఈఎంయూ రైలును కూడా జెండా వూపుతారు. కడపలో బయలుదేరే రైలును రిమోట్ ద్వారా ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు.